రూట్ మార్చిన జయప్రద: సోనియా గాంధీతో భేటీ?

గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్ర పోషించిన జయప్రద ఆ తర్వాత ఉత్తరాది రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. రాంపూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ పార్టీ నుంచి ఆమె బహిష్కరణకు గురయ్యారు. దాంతో ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి నుంచి లోకసభకు పోటీ చేయాలనే ఆకాంక్షను ఆమె బహిరంగంగానే వెల్లడించారు.
ఆమె వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, రాజమండ్రి టికెట్ ఇస్తానని హామీ ఇస్తేనే పార్టీలో చేరుతానని ఆమె చెప్పారని అంటున్నారు. అయితే, బేషరతుగా పార్టీలో చేరాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెసు రాజమండ్రి టికెట్ ఇస్తానని హామీ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్లడానికి జయప్రద సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రాజమండ్రి టికెట్ పొందాలనే ఉద్దేశంతోనే ఆమె బుధవారంనాడు సోనియాను కలిసినట్టు తెలుస్తున్నది. అయితే ఇటీవల తమ నివాసానికి అనవసరంగా వచ్చి తమ కారుపై బల్బును తొలగించిన ఒక అధికారి అతిప్రవర్తనను సోనియా దృష్టికి తీసుకువెళ్లడానికే జయప్రద బుధవారంనాడు సోనియాను కలిసినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెసు అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. ఆయనను రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు చేసి జయప్రదకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్ ఇవ్వవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications