తెరాసలోకి జంప్లకు దూరం: కెసిఆర్ భయమే?

గతంలో తెరాసలో చేరి బయటకు వచ్చిన నాయకుల అనుభవాలను వారు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం శానససభ్యులు చాలా మంది తెరాసలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు గత కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నారు. పార్టీలో చేరిన తర్వాత తమ పరిస్థితి పూర్తిగా కెసిఆర్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందనే భావన వారిని వెనక్కి లాగుతున్నట్లు చెబుతున్నారు. అవమానాలకు గురి కావాల్సి వస్తుందనే భావన వ్యక్తమవుతోంది. కెసిఆర్ అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆ భావన మాత్రం బలంగానే ఉంది.
ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కెసిఆర్ నాయకత్వాన్ని అంగీకరించలేక కూడా తెరాసలోకి రావడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. రాజకీయాల్లో కెసిఆర్ కన్నా తాము సీనియర్లమని, అందువల్ల కెసిఆర్ నాయకత్వంలో ఎలా పనిచేస్తామని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయమే తెరాసలో చేరడానికి కొంత మంది నాయకులు వైముఖ్యం ప్రదర్శించడానికి కారణమని అంటున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమం విషయంలో అది పనికి రాదని తెరాస నాయకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి వచ్చే సరికి కెసిఆర్ నాయకత్వాన్ని అంగీకరించాల్సిందేనని వారు వాదిస్తున్నారు.
అయితే, తెరాసలో చేరిన తర్వాత కెసిఆర్ వ్యవహరించే తీరు పూర్తిగా మారుతుందనే భయం మాత్రం చాలా మందిలో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో తెరాసలో చేరి, బయటకు వచ్చిన ఉదంతాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కూడా మానసిక వేదనకు గురవుతున్నారనే మాట వినిపిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి తెరాసలోకి వెళ్లకుండా బిజెపి వైపు చూడడానికి ఇది ప్రధాన కారణమని అంటున్నారు.
తెరాస ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో మంది నాయకులు కెసిఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అలా మెలిగినవారు తదనందర కాలంలో తెరాస నుంచి బయటకు వచ్చారు. కెసిఆర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద కెసిఆర్పై మాత్రం ఆ అభిప్రాయం బలంగానే ఉంది. తెలంగాణవాదాన్ని కాకుండా తమ రాజకీయ భవిష్యత్తుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే నాయకులు మాత్రమే కెసిఆర్పై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది.
కెసిఆర్ నాయకత్వం ముందు నిలబడలేక అభద్రతా భావానికి గురయ్యే నాయకులు మాత్రమే దుష్ప్రచారం సాగిస్తున్నారని అంటున్నారు. ఉద్యమంలో సినియారిటీని పట్టించుకోవాల్సిందే తప్ప రాజకీయాల్లో సీనియారిటీ చూడడం తగదనేవారు కూడా ఉన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు కెసిఆర్పై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అంటున్నారు. కెసిఆర్ను దెబ్బ తీస్తే తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయవచ్చునని అనుకుంటున్నారని, అందుకే కెసిఆర్ను లక్ష్యంగా చేసుకుని లేనిపోనివి కల్పిస్తున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications