మృగాల కంటే హీనమా, గాంధీజీ ఉంటే: పోలీసుపై సుప్రీం

దేశవ్యాప్తంగా పోలీసులు చేస్తున్న పనులు కనీసం జంతువులు కూడా చేయవని, ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా? నిస్సహాయురాలిపై పోలీసులు ఎలా దాడి చేయగలిగారు? చేస్తున్నారు? అని యూపి ప్రభుత్వంపై న్యాయస్థానం మండిపడింది. అలీగఢ్లో ఆరేళ్ల బాలికపై అత్యాచారాన్ని నిరసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై పోలీసుల దాష్టీకాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటివి మరోసారి జరిగితే తాము కూడా నిబంధనలు పక్కకు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.
అలీగఢ్ ఘటనపై వివరణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని యూపి చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు దేశానికి మచ్చ తెస్తున్నాయని, వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇక ఢిల్లీలో చిన్నారిపై అత్యాచార ఘటనపై నిరసన తెలుపుతున్న ఓ యువతిపై పోలీస్ అధికారి చేయి చేసుకోవడంపైనా సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ని ఆదేశించింది. ఐదేళ్ల పాపపై అత్యాచారాన్ని నిరసిస్తున్న యువతిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ జిఎస్ సింఘ్వి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
అలాగే నేరం రుజువైతే.. దోషులకు విధించే శిక్ష వారి నేర తీవ్రతకు తగినట్లుగా ఉండాలని కింది కోర్టులకు సూచించింది. తగిన పరిహారం అందాల్సిందే లైంగిక దాడుల బాధితులను భిన్నంగా పరిగణించి వారికి తగిన న్యాయం చేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. దోషుల నుంచి బాధితులకు తగిన పరిహారం అందేలా.. 18 ఏళ్ల క్రితంనాటి తన ఉత్తర్వులను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. లైంగిక దాడుల బాధితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని 1995లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.
అత్యాచార బాధితురాలిని వీలును బట్టి మహిళా పోలీసు అధికారులకే అప్పగించేలా దర్యాప్తు అధికారులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి వాంగ్మూలాన్ని వీలైతే వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే తీసుకోవాలని, దాని వల్ల బాధితురాలికి ధైర్యం కలుగుతుందని పేర్కొంది. మహిళా డాక్టర్తోనే పరీక్షలు జరిపి, వీలైనంత త్వరగా నివేదిక రూపొందించాలని కూడా సూచించింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి నిందితులు తప్పించుకోకుండా జాగ్రత్త పడాలని పోలీసులకు తెలిపింది.












Click it and Unblock the Notifications