ఎట్టకేలకు ఖమేనీ అంత్యక్రియలు..! ప్రధాని మోడీకి పిలుపు..!
అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దంలో అమరుడైన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమైనీ (Ayatollah Khamenei) అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే అప్పటి నుంచీ నిరంతరాయంగా ఇరాన్ పై ఈ రెండు దేశాలు దాడులు జరుపుతూ వచ్చాయి. దీంతో అధికారికంగా నిర్వహించాల్సిన ఖమైనీ అంత్యక్రియలకు యుద్దం ఆటంకంగా మారింది. తాజాగా యుద్దం ముగియడంతో ఖమైనీ అంత్యక్రియలకు రంగం సిద్దమవుతోంది.
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే యుద్దం వంటి సమయాల్లో దీనికి మినహాయింపు ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న చనిపోయిన ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భద్రపరిచింది. యుద్దం ముగియగానే అధికారికంగా తన తండ్రి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ భావించారు. ఇప్పుడు యుద్దం ముగింపుతో ఈ కార్యక్రమాన్ని జూలై మొదటివారంలో నిర్వహించబోతున్నారు.

జూలై 4న ఆయతుల్లా ఖమేనీ భౌతిక కాయానికి అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా సముదాయంలో ఖమేనీ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఖోమ్లలో బహిరంగ ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే ఇరాకీ పవిత్ర నగరాలైన నజఫ్, కర్బలాలలో కూడా ప్రార్థనలు జరుగుతాయి. ఖమేనీ స్వస్థలమైన మషద్లోని ఇమామ్ రెజా మందిరంలో జూలై 9న తుది ఖనన కార్యక్రమం జరగనుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయ వ్యవస్థను తీర్చిదిద్దిన నాయకుడికి ఇది అధికారిక వీడ్కోలు పలికే కార్యక్రమం కాగా, ఇందులో లక్షలాది మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియలు, ఖనన కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని అధికారికంగా ఆహ్వానించారు.














Click it and Unblock the Notifications