నేను విశాఖ ఎంపీని: టిఎస్సార్కు పురంధేశ్వరి కౌంటర్
తాను విశాఖపట్నం ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నానని, నగరంలోని సమస్యల పరిష్కారం, అభివృద్ధిపైనే తాను దృష్టి కేంద్రీకరిస్తున్నానని పురందేశ్వరి అన్నారు. ప్రజల విశ్వాసానికి దీటుగా పనిచేయాల్సి ఉన్నందున, ఇతర విషయాలు పట్టించుకోవటం లేదని ఆమె స్పష్టం చేశారు.
విశాఖ అభివృద్ధికి ఎంపీగా తాను కృషి చేస్తున్నానని అంటూ తన పని తాను చేసుకోనివ్వాలని కోరారు. తనను నర్సారావుపేటకు వెళ్లాల్సిందిగా ఏ ప్రాతిపదికన సుబ్బిరామిరెడ్డి అంటున్నారో ఆయననే అడగాలని పురందేశ్వరి సూచించారు. చంద్రబాబు పాదయాత్ర గురించి ప్రస్తావించగా ఎన్నికల్లో తమ పార్టీ ఎలా గెలవాలన్న అంశంపైనే తాము దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట నియోజకవర్గం నుండే పోటీ చేస్తారని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి శుక్రవారం అన్నారు. విశాఖపట్నం లోకసభ స్థానంపై కాంగ్రెసు పార్టీలో అంతర్గంతంగా రగడ ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. గతంలో నర్సారావుపేట నియోజకవర్గాన్ని పురంధేశ్వరి ఆశించారని, ప్రస్తుతం అక్కడ ఖాళీగా ఉందని అక్కడకు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తాను 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానం నుండే పోటీ చేస్తానని చెప్పారు.