వైయస్పై సోనియా పొరపాటు: జగన్ అతి జాగ్రత్తలు!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన పొరపాటు తన పార్టీలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా ఆయనకు రాష్ట్రం విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయం తెలిసిందే. అలా చేయడం వల్ల వైయస్ రాష్ట్రస్థాయిలో హైకమాండ్గా ఎదిగారు.
వైయస్ ఉన్నప్పుడు పార్టీకి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు రాకపోయినా ఆయన మృతి తర్వాత వైయస్ ఇమేజ్ కారణంగా ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల కాంగ్రెసు పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వైయస్కు అంతలా స్వతంత్రం ఇవ్వకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అధిష్టానం మదనపడుతుంది కూడా. ఇప్పుడు సోనియా చేసిన పొరపాటును తాను చేయకుండా జగన్ జాగ్రత్తపడుతున్నారంటున్నారు.

మేకపాటి, కొండా దంపతులపై...!
నేతలు తమకు ఏకు మేకయ్యేలా ఉండకుండా జాగ్రత్త పడుతున్నారట. అందులో భాగంగానే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపగల్గిన నేతలను నియోజకవర్గాలకే పరిమితం చేసే ఎత్తుగడకు తెరలేపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వారు ఎదిగితే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు అధిష్టానంలో ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
ఆయా జిల్లాల్లో బలంగా ఉన్న నేతలను కేవలం నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావిస్తున్నారట. వరంగల్ జిల్లా నేత కొండా సురేఖ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మేకపాటి రాజమోహన్ రెడ్డిలు ఈ కారణంగానే అసంతృప్తిగా ఉండవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications