సరబ్జిత్ బతికే ఛాన్స్ తక్కువే: చంపాలనే ఈ దాడి

మరోవైపు సరబ్జిత్ను అంతమొందించాలనుకున్నట్లు ఇక్కడి కోట్ లఖ్పత్ జైలులో అతనిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచిన కేసులో ప్రధాన నిందితులు అమర్ అఫ్తాబ్, ముదస్సర్లు విచారణలో వెల్లడించారు. 1990లో లాహోర్లో బాంబు దాడులు జరిపి 14 మంది పాకిస్థాన్ పౌరుల ప్రాణాలు తీసినందుకే వారు సరబ్జిత్ ప్రాణాలు తీయాలనుకొన్నట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) మాలిక్ ముబాషిర్ ఈ మేరకు ప్రాథమిక నివేదిక సమర్పించారు.
సరబ్జిత్ను చంపడానికి పదునుగా తయారు చేసిన స్పూన్లు, ఖాళీ డబ్బా రేకుల నుంచి తయారు చేసిన బ్లేడ్లు, ఇటుకలను ఉపయోగించినట్లు వారు వెల్లడించారు. అయితే ఎంతో కాలంగా జైలులో ఉంటున్న నిందితులిద్దరూ ఇప్పుడే ప్రత్యేకంగా సరబ్జిత్పై ద్వేషం ఎందుకు పెంచుకున్నారో తెలీడం లేదు. మరణశిక్షను ఎదుర్కొంటున్న నిందితులిద్దరికీ ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు లేవని తెలుస్తోంది.
ఎవరో రాసిచ్చిన మాటలను వల్లె వేసినట్లు వీరిద్దరి మాటలు ఒకే రకంగా ఉన్నాయని జైలు వర్గాలు తెలిపాయి. మరోవైపు సరబ్జిత్ భార్య సుఖ్ప్రీత్ కౌర్, కూతుళ్లు పూనమ్, స్వపన్దీప్, సోదరి దల్బీర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అత్తారి-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్లో ప్రవేశించారు. సరబ్జిత్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలన్న లక్షలాది మంది భారతీయుల ప్రార్థనలతో పాకిస్థాన్కు వెళుతున్నట్లు సరబ్జిత్ సోదరి దల్బీర్ తెలిపారు.
అంతకు ముందు సరబ్జిత్ కుటుంబం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు జరిపింది. తమ సోదరుణ్ని చూడడానికి తమకు 15 రోజుల వీసా లభించినట్లు దల్బీర్ తెలిపారు. తన భర్తకు మరింత మెరుగైన వైద్యం అందజేసేందుకు అతణ్ని భారత్కు తరలించడానికి అవకాశమివ్వాలని అతని భార్య సుఖ్ప్రీత్ కౌర్ పాక్కు విజ్ఞప్తి చేసింది. పాకిస్థానీ ప్రజల సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.












Click it and Unblock the Notifications