షాక్: చంద్రబాబుకు దాడి, వైయస్ జగన్కు రెహ్మాన్
విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు సభకు కూడా దాడి వీరభద్రరావు దూరంగా ఉన్నారు. దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవీకాలం గురువారంనాటితో ముగిసింది. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి దాడి వీరభద్రరావు రేపు (శుక్రవారం) అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. దాడి వీరభద్ర రావు స్థానంలో ఎమ్మెల్సీ టికెట్ను చంద్రబాబు యనమల రామకృష్ణుడికి ఇచ్చారు.
యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విషయంపై కనీసం తనతో మాట్లాడలేదని దాడి వీరభద్రరావు అలిగారు. తనను సంప్రదించకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు. దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, మోత్కుపల్లి నర్సింహులుతో విభేదాలతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన వరంగల్ జిల్లా సీనియర్ నేత కడియం శ్రీహరి గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాను టిడిపిలోనే ఉంటానని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతాననే ప్రచారంలో నిజం లేదని కడియం శ్రీహరి చెప్పారు.
రెహ్మాన్ తిరుగుబాటు
మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. రెహ్మాన్ తీరుకు పార్టీ సీనియర్ నేతలు సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ అవాక్కయ్యారు. పార్టీ సమన్వయ కమిటీల్లో ముస్లింలు లేకపోవడంపై ఆయన విమర్సలు చేశారు. రెహ్మాన్ అనే పేరు పెట్టుకుంటే లాభం లేదని, రెహ్మాన్ రెడ్డి అని పేరు పెట్టుకుంటే ప్రయోజనం ఉండేదేమోనని రెహ్మాన్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో లుకలుకలు ఒక్కటొక్కటే బయపడుతున్నాయి.