కిరణ్ రెడ్డిపై అధిష్టానం వద్దకు: బయ్యారం ఘాటు
బంగారుతల్లి పథకంపై సీనియర్ మంత్రులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, విధి విధానాలు ఏమిటో తెలియదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయంపై పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఇటీవల మెదక్జిల్లా, సంగారెడ్డిలో 'బంగారు తల్లి' పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో అసమ్మతి మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా 'బంగారుతల్లి' పథకంపై చర్చించినట్లు సమాచారం. సుమారు గంటపాటు చర్చలు జరిపిన మంత్రులు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చించలేదని, కిరణ్ వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి, వట్టివసంత్కుమార్, డీఎల్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే, కొండా మురళి వంటి జూనియర్ మంత్రులు మాత్రం ముఖ్యమంత్రిని సమర్థిస్తున్నారు.
బయ్యారం గనుల సెగ కూడా ముఖ్యమంత్రికి ఘాటుగానే తగులుతోంది. బయ్యారం గనుల విషయంలో కూడా జానారెడ్డి ముఖ్యమంత్రితో విభేదిస్తున్నారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి తీరును తెలంగాణ నేతలు అమోస్, యాదవరెడ్డి తప్పు పట్టారు. 2014 వరకు తెలంగాణపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోదని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వారు విమర్శించారు. తెలంగాణ నిర్ణయం కేంద్ర పరిధిలోనిదని దీనిపై వ్యాఖ్యానించేందుకు ముఖ్యమంత్రి ఎవరని ఆయన అడిగారు.
సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి ముఖ్యమంత్రిగా అండగా నిలిచారు. బయ్యారంతో ఎటువంటి సంబంధం లేని మెదక్ జిల్లా ప్రజలు రేపటి బంద్కు సహకరించవద్దని ఆయన కోరారు. గతంలో రక్షణ స్టీల్స్తో సంబంధం ఉన్నందువల్లనే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ బయ్యారం గనులపై మాట్లాడలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం డబ్బుల కోసమే బయ్యారం గనుల వ్యవహారాన్ని ఎత్తుతున్నారని ఆయన అన్నారు. బంద్ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.