40వేల కోట్ల లూటీ, అఫ్జల్నే ఉరి తీశారు: జగన్ కేసులో సిబిఐ
ఈ కేసులో సాయిదే కీలక పాత్ర అని, ఇందు, రఘురామ్ సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ పైన విచారణ జరుపుతున్నామని, ఈ మూడింటిలో సాయి పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలిందని అశోక్ బాన్ చెప్పారు. సాయి ప్రమేయంతోనే జగన్ కంపెనీలలోకి రూ.40వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతస్థాయిలో లూటీ జరిగిందన్నారు.
ఈ నెల 26న కూతురు పెళ్లి ఉందనే కారణంతో అతనికి బెయిల్ను కొనసాగించవద్దన్నారు. అతనే సూత్రధారి అని, ధనబలం, కండబలంతో జగన్ కంపెనీలలో పారిశ్రామికవేత్తల నుండి పెట్టుబడులు పెట్టించారన్నారు. కూతురు పెళ్లి ఉందని చెబుతున్నారని, అంతగా అవసరమైతే పెళ్లి తర్వాత లొంగిపోవాలని ఆదేశించాలని కోరారు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి వారి పైన దయ అవసరం లేదన్నారు. సాయి బయట ఉండి సాక్ష్యులను బెదిరిస్తున్నారన్నారు. హత్య చేసిన వ్యక్తి కన్నా కుట్రదారుడే ప్రమాదకరమన్నారు. పార్లమెంటు దాడి కేసులో కుట్రదారుడైన అఫ్జల్ గురునే ఊరి తీశారని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కేసులో సాయి పాత్రపై విచారణలో ఒక్కొక్క అంశం బయటపడుతుందని, కేసులో దర్యాఫ్తు పూర్తి చేయాలంటే కనీసం మూడు నెలలైనా అతను జైలులో ఉండాల్సిందే అన్నారు. సాయి సాక్ష్యులను ప్రభావితం చేసినట్లు పక్కా సమాచారముందన్నారు. విజయలక్ష్మి, దాల్మియా సిమెంట్ వివరాలను సిబిఐకి చెప్పవద్దని సాయి బెదిరించారన్నారు.
తీర్పు రిజర్వ్
ఇరువైపుల వాదనలను విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. కేసు పురోగతిపై సాయంత్రంలోగా సీల్డు కవరులో అందించాలని సిబిఐని ఆదేశించింది.