కోబ్రా పోస్ట్: మనీలాండరింగ్ చిక్కుల్లో మంత్రి శైలజానాథ్
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తమ పరిశోధన జరిగిందని కోబ్రా పోస్టు వెల్లడించింది. ఈ మనీ లాండరింగ్ లావాదేవీల్లో రాష్ట్రానికి చెందిన మంత్రి శైలజానాథ్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించింది. దీనిపై మంత్రి శైలజానాథ్ ప్రతిస్పందించారు. దాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు.
తిరుపతికి చెందిన డాక్టర్ హరికృష్ణ తన మిత్రుడని, హరికృష్ణకు తాను మాట సాయం చేశానని శైలజానాథ్ చెప్పారు. హరికృష్ణకు తన రెఫరెన్స్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
మనీలాండరింగ్ వంటి పెద్ద పెద్ద పదాలు వాడవద్దని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు. దీనిపై తాను ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మీడియా మిత్రులు వాస్తవాలు తెలుసుకుని కథనాలు ప్రసారం చేస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. మనీలాండరింగ్కు పాల్పడేంత సీన్ లేదని ఆయన అన్నారు. ఆస్తులు కుదువ పెట్టి రుణం తీసుకుంటానంటే హరికృష్ణకు తాను మాట సాయం చేసినట్లు ఆయన తెలిపారు. హరికృష్ణ రుణం తీసుకున్నాడో, లేదో కూడా తెలియదని ఆయన అన్నారు.