రూ.1,200 కోట్ల పెట్టుబడితో థెరానిమ్ బయోలాజిక్స్..1,500 మందికి ఉపాధి;మంత్రి శుభవార్త!
తెలంగాణాలో మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. సంగారెడ్డి జిల్లా బొరపట్లలో తెలంగాణ ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 'థెరానిమ్ బయోలాజిక్స్' అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు.
1200 కోట్ల భారీ పెట్టుబడితో థెరానిమ్ బయోలాజిక్స్
దాదాపు రూ.1,200 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ యూనిట్, రాష్ట్ర ఫార్మా రంగానికి మరో మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సంస్థ 'MSD' ఈ ప్రాజెక్టుకు భాగస్వామిగా వ్యవహరించడం విశేషం.

దేశంలోనే అతిపెద్ద బయోలాజిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటి
ఈ సరికొత్త బయోలాజిక్స్ కేంద్రం సంవత్సరానికి 2.5 నుంచి 3 కోట్ల వైల్స్ ఉత్పత్తి చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. తద్వారా దేశంలోనే అతిపెద్ద బయోలాజిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఇది అవతరించింది. క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు అవసరమైన కీలకమైన బయోలాజికల్ ఔషధాలను ఈ కేంద్రంలో తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ స్థాపన ద్వారా స్థానికంగా సుమారు 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
క్యాన్సర్ వైద్యానికి కావాల్సిన బయోలాజికల్ మద్దతు
రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులను అరికట్టడం, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ సంస్థ అందుకు కావాల్సిన బయోలాజికల్ మద్దతును ఇస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం తెలంగాణాప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని అన్నారు.క్యాన్సర్ రోగుల నమోదు, పర్యవేక్షణ, చికిత్స అందించే ప్రభుత్వ వైద్యవ్యవస్థను బలోపేతం చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్యాన్సర్ను 'నోటిఫైయబుల్ డిసీజ్'గా ప్రకటించింది.
క్యాన్సర్ నియంత్రణకు ప్రభుత్వ చర్యలు
క్యాన్సర్ చికిత్సను కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా వికేంద్రీకరిస్తూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 'డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను' ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల రోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఉచితంగా కీమోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు రీజినల్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, రోగులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ సేవలను విస్తరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం నేడు భారతదేశానికి బల్క్ డ్రగ్ క్యాపిటల్గా, ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్గా అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో749 గుర్తింపు పొందిన ఔషధ తయారీ యూనిట్లు ఉన్నాయన్నారు.77 డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు సేవలందిస్తున్నాయన్నారు.50 వేలకు పైగా లైసెన్స్ పొందిన మెడికల్ షాపులు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి ప్రభుత్వ కట్టుబాటు
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మందులను అందుబాటు ధరల్లో అందించేందుకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిరంతరం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. నకిలీ, నాణ్యతలేని మందుల తయారీ, విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేసిన థెరానిమ్ బయోలాజిక్స్, ఆరోబిందో ఫార్మా, మరియు MSD సంస్థల ప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలియజేశారు.













Click it and Unblock the Notifications