కర్ణాటక: బిజెపి ఓటమికి కారణాలు ఏమిటి?
గాలి సోదరుల అవినీతి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప అవినీతి ప్రధానంగా బిజెపిని దెబ్బ తీశాయనే అంచనాలు సాగుతున్నాయి. కానీ, బిజెపి పెద్ద యెత్తున ఓటు బ్యాంకును కోల్పోవడానికి పనిచేసిన అంశాలు వేరుగా కనిపిస్తున్నాయి. బిజెపిని గెలిపించిన యడ్యూరప్ప వేరు కుంపటి పెట్టుకోవడాన్ని, గాలి సోదరుల అనుచరుడు శ్రీరాములు మరో పార్టీని స్థాపించడం బిజెపి ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
గతంలో ఉత్తర కర్ణాటకలో బిజెపి పెద్ద యెత్తున సీట్లు గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో లింగాయత్లు అధికంగా ఉన్నారు. లింగాయత్ కులానికి చెందిన యడ్యూరప్ప కారణంగానే గత ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచాయనే అంచనా ఉంది. ఇప్పుడు కెజిపిని స్థాపించి విడిగా పోటీ చేయడంతో బిజెపి ఆ మేరకు ఓటు బ్యాంకును కోల్పోయిన సూచనలు కనిపిస్తున్నాయి.
యడ్యూరప్ప తాను గెలువకపోయినా బిజెపిని ఓడించి కక్ష ప్రతీకారం తీర్చుకున్నారు. అలాగే, బళ్లారి గతంలో కాంగ్రెసు పార్టీకి పెట్టనికోటగా ఉండేది. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు బిజెపిలో కీలక పాత్ర పోషించడం ప్రారంభించిన తర్వాత దృశ్యం మారిపోయింది. కాంగ్రెసు కంచుకోటను బిజెపి బద్దలు కొట్టడంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు కీలక పాత్ర పోషించారు. గనులపై ఆధిపత్యం సాధించి, తద్వారా వచ్చిన డబ్బులను వారు విపరీతంగా ఎన్నికల్లో గుప్పించారనే ఆరోపణ ఉంది. దాంతో బిజెపి గత హైదరాబాద్ రాజ్యంలో కర్ణాటక ప్రాంతంలో అప్పుడు విజయం సాధించిందని అంటారు.
గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడం, బిజెపికి గాలి సోదరులు దూరం కావడం, వారి అనుచరుడు బి. శ్రీరాములు బిఎస్సార్ పార్టీ పెట్టి ఎన్నికల గోదాలోకి దిగడం వంటి కారణాలతో కాంగ్రెసు లాభపడిందని చెప్పాలి. అవినీతి ఆరోపణల కారణంగా బిజెపికి దూరమైన యడ్యూరప్ప, గాలి సోదరుల ప్రాబల్యం బిజెపికి పనికి రాకుండా పోయాయి. యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీలు ఓట్లను చీల్చిన మేరకు బిజెపి నష్టపోయి కాంగ్రెసు లాభపడింది.
రాహుల్ గాంధీ నాయకత్వానికి ఓటు వేశారా..
కర్ణాటక శానససభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వానికి ప్రజలు ఓటేశారనే వాదనను కాంగ్రెసు పార్టీ నాయకులు ముందుకు తెస్తున్నారు. బిజెపి అవినీతి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు కాంగ్రెసు సానుకూల ఓటు పడి కాంగ్రెసు విజయం సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బయటకు ఈ వాదన సరైందిగానే కనిపిస్తుంది. కానీ, బిజెపి ఓటర్లను ప్రభావితం చేసే రెండు బలమైన లాబీలను యడ్యూరప్ప, గాలి సోదరుల రూపంలో దూరంగా చేసుకుందనే విషయాన్ని గమనిస్తే ఫలితాలకు ఈ విధంగా రావడానికి కారణమేమిటో అర్థమవుతుంది.
దేశవ్యాప్తంగా కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెసుకు అనుకూలంగా వాతావరణం ఉందని, కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెసు విజయం సాధిస్తుందనే ధీమాను కాంగ్రెసు నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
కానీ, కాంగ్రెసు నాయకుల వాదనకు పునాది ఉన్నట్లు కనిపించడం లేదు. కర్ణాటకలో బిజెపి ఓటమికి స్వయంకృతాపరాధమే ఎక్కువ. అవినీతి నాయకులను ప్రోత్సహించి అధికారంలోకి వచ్చిన బిజెపి, అదే అవినీతి నాయకుల కారణంగా ఓటమి పాలైంది. యడ్యూరప్ప చేత రాజీనామా చేయించి, ముఖ్యమంత్రులను మారుస్తూ పోవడం బిజెపికి వ్యతిరేకంగా పనిచేసింది.
ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపి నాయకులు పాకులాడిన తీరు, అందుకు వారు చేసిన రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు ప్రజలకు ఏవగింపు కలిగించాయని చెప్పాలి. పదవిపై ఆకాంక్ష తప్ప బిజెపి నాయకులకు ప్రజల గోడు పట్టదనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో బిజెపి ఓటమి పాలైంది.