పావుగా మారిన జగన్: ధైర్యం నూరిపోస్తున్న అంబటి
వారి ఆశలు నీరుగార్చేలా తాము మరింత ఉత్సాహంగా పని చేస్తామని అంబటి అన్నారు. ప్రజలు టిడిపి, కాంగ్రెసులను చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ బయటకు వస్తే తమ పని ఖతం అనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెసు, టిడిపిలు కుట్రతో ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీల కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. రాజకీయ క్రీడలో జగన్ పావు అయ్యారన్నారు.
జగన్ను ఏడాదిగా జైలులో పెట్టి పార్టీని నాశనం చేసే కుట్రకు పాల్పడినా వారి ఆశలు నెరవేరలేదన్నారు. తమ పార్టీ చెక్కుచెదరలేదని, ఉత్సాహంగా దూసుకుపోతున్నామన్నారు. బెయిల్ రానంత మాత్రాన క్యాడర్ నిరుత్సాహపడవద్దని సూచించారు. కాంగ్రెసు, టిడిపిలో మైండ్ గేమ్ ఆడుతున్నాయని, వాటి ట్రాప్లో పడవద్దన్నారు. ఇప్పుడు కాకపోయినా నాలుగు నెలల తర్వాత న్యాయమే గెలుస్తుందన్నారు.
బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగన్కు బెయిల్ వస్తుందని భావించామన్నారు. సిబిఐ న్యాయవాది అశోక్ బాన్ కాంగ్రెసు ప్రతినిధిగా మాట్లాడుతున్నారన్నారు. తమకు న్యాయస్థానాల పైన నమ్మకముందని కానీ, సిబిఐ చిలుకపలుకులు కోర్టులు నమ్మాయన్నారు. విజయమ్న నాయకత్వంలో తాము ముందుకెళ్తామన్నారు.
జగన్ జైలులో ఉన్నా తమ పార్టీ ముందుకెళ్తుందన్నారు. సుప్రీం కోర్టు సిబిఐకి డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోందని, ఆ తర్వాత న్యాయమే గెలుస్తుందన్నారు. సిబిఐ అభియోగాలు నిరూపించలేకపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీలో అసంతృప్తులు ఎవరూ లేరన్నారు. తమ పార్టీలో విభేదాలు లేవని, అభిప్రాయబేధాలు ఎక్కడైనా సహజమే అన్నారు.