జాతీయ రహదారుల నిర్వహణ ప్రైవేట్ కు.. 17రహదారులతో తాత్కాలిక జాబితా!
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్వహణ మరియు అభివృద్ధిని వేగవంతం చేయడానికి జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. దీని భాగంగా దేశంలోని 17 ముఖ్యమైన జాతీయ రహదారులను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యం.
ప్రైవేట్ కు ఎన్హెచ్-163 మార్గంలోని యాదగిరి-వరంగల్ సెక్షన్ నిర్వహణ
ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్హెచ్-163 మార్గంలోని యాదగిరి-వరంగల్ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ను రెండు ప్యాకేజీలుగా విభజించి ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. మొత్తం 99.1 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిపై కోమళ్ల మరియు కోమటపల్లి టోల్ ప్లాజాల పరిధిలోని భాగాలు ఇందులో భాగం. దీంతో రహదారి నిర్వహణ బాధ్యతలు, టోల్ వసూళ్లు అన్నీ ప్రైవేటు సంస్థలకు చెందుతాయి.

నిధుల సమీకరణకు మార్గం
ఎన్హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం నిధుల సమీకరణ. జాతీయ రహదారుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన భారీ మొత్తంలో నిధులు సమకూర్చుకోవడానికి ఈ మార్గం సహాయకరంగా ఉంటుంది. రహదారులను లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ భారం తగ్గి, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించవచ్చు.ఈ ప్రక్రియను రెండు పద్ధతుల్లో అమలు చేయనున్నారు.
రెండు పద్దతులలో టోల్ వసూళ్లు, రోడ్ల నిర్వహణ
మొదటి పద్ధతి టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (TOT). ఈ మోడల్లో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి భారీ మొత్తంలో చెల్లింపులు చేసి, నిర్ణీత కాలం వరకు టోల్ వసూళ్లు మరియు నిర్వహణ హక్కులు పొందుతాయి. రెండవ పద్ధతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT). ఇది మ్యూచువల్ ఫండ్ లాంటి వ్యవస్థ, ఇందులో ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించి రోడ్డు ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.
ఈ రాష్ట్రాల్లో 17 రహదారులతో తాత్కాలిక జాబితా
హరియాణా, ఝార్ఖండ్ నుంచి మూడు రహదారులు, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నుంచి రెండు చొప్పున, కర్ణాటక, బిహార్ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఈ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో యాదగిరి-వరంగల్ మార్గం మెరుగైన నిర్వహణ, సకాలంలో మరమ్మతులు, మెరుగైన సౌకర్యాలు అందించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ఊపు
ఈ కొత్త విధానం దేశవ్యాప్తంగా రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ఊపు ఇవ్వనుంది. ప్రైవేటు రంగం పాల్గొనడం వల్ల సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది. అయితే, టోల్ రేట్లు పెరిగే అవకాశం ఉండొచ్చని ప్రజలు ఆందోళనలో ఉన్నారు . ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టులను పారదర్శకంగా అమలు చేస్తే రహదారి వినియోగదారులకు మేలు చేస్తుందని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications