సిఎంగా సిద్ధరామయ్య ప్రమాణం: ఢిల్లీ వెళ్లొచ్చాక కేబినెట్
సిద్ధరామయ్య 28వ ముఖ్యమంత్రిగా పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎం కృష్ణ, అంబరీష్, కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే, కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర, మధుసూదన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
కాంగ్రెసు పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి రేసులో చాలామంది నేతలు చేరిపోయారు. సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ రేసులో నిలిచారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్న సిద్దరామయ్య బెంగళూరులో గురువారం రోజంతా బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచే ఆయన నివాసం ఎమ్మెల్యేలు, అభిమానులతో కిటకిటలాడింది. అనంతరం సీన్ ఓ ప్రైవేట్ హోటల్కు మారింది.
తనకు మద్దతునిస్తున్న దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య సమాలోచనలు జరిపారు. పరమేశ్వర కూడా సిఎం రేసులో ఉన్నానని చెప్పారు. దళితుడికి ఈసారి సిఎం పదవి కట్టబెట్టాలనే వాదనను మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తారు. ఆయన తనకు సిఎం పదవి కోసం పావులు కదిపారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి డికె శివ కుమార్ కూడా చక్రం తిప్పారు.
ఇంతమంది పోటీ నేపథ్యంలో అధిష్టానం కుల సమీకరణాలను అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఈ రోజు సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు.