నాకేం సంబంధం లేదు: చంద్రబాబుపై కన్నా ఫైర్

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 12వ నెంబర్ జీవోను పట్టుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ జీవో జారీతో తనకు ఏ విధమైన సంబంధం లేదని కన్నా అన్నారు. అంతకు ముందు జారీ అయిన రెండు జీవోల మేరకు జీవో నెంబర్ 12ను ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేశారని ఆయన చెప్పారు. జీవో అసలు మంత్రి వద్దకు రాదని, తన వద్దకు ఆ జీవో రానే లేదని ఆయన చెప్పారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తనపై బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్సించారు. చంద్రబాబునాయుడిపై అవినీతి ఆరోపణలను మరిచిపోయారని అనుకుంటున్నారేమోనని ఆయన అన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అశోక గజపతిరాజుపై కూడా కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. అశోక్ గజపతి రాజు గతంలో మంత్రిగా ఎలా పనిచేశారో తెలియదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఆ జీవో విడుదలైందనేది ప్రధాన ఆరోపణ. వివాదాస్పద జీవోలు జారీ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆరుగురు మంత్రుల్లో కన్నా లక్ష్మినారాయణ ఒక్కరు. జగన్ ఆస్తుల కేసులో అందుకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ అరెస్టయి మంత్రిపదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై అభియోగాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications