ఒక్కరు పోతే 50 మంది లీడర్లను తయారు చేస్తా: బాబు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి జెండా రాష్ట్రంలో ఎగరాలన్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులు అంతా కలిసి పని చేయాలన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో టిడిపి నేతలు పార్టీని విడిచి వెళ్లాక ఇతరులకు బాధ్యతలు అప్పగించానని, అక్కడ బ్రహ్మాండమైన మార్పు కనిపించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ జిల్లాలో టిడిపి గెలిచే మొదటి సీటు పర్చూరే అన్నారు. అనకాపల్లిలోను అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
దాడి వీరభద్ర రావుతో కొంతమంది వెళ్లినా మిగిలిన వారంతా పార్టీలోనే ఉన్నారన్నారు. తెరాస కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీ అని, కాంగ్రెసు రోజు రోజుకు క్షీణిస్తోందని, వైయస్సార్ కాంగ్రెసు దొంగల పార్టీ అని అన్నారు. టిడిపి మాత్రమే ప్రజలతో, కార్యకర్తలతో మమేకమవుతోందన్నారు. ఇక ప్రతి ఎన్నికల్లో ఇరవై శాతం మందికి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు.
మహానాడు తర్వాత ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపడతామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి కోర్ కమిటీని త్వరలో నియమిస్తానని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికను అందించి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.