జనం మధ్యకు జగన్నాధుడు.. జగన్నాథ రథయాత్రలో విశేషాలు ఇవే!
కోట్లాదిమంది భక్తుల కలల యాత్ర జగన్నాథుడి రథయాత్ర. అటువంటి జగన్నాథుడి రథయాత్ర నేడు ప్రారంభం అవుతుంది. ఆలయంలో ఉండే జగన్నాథుడు సోదరుడైన బలభద్రుడు సోదరి అయిన సుభద్రాదేవి తో కలిసి జనం మధ్య ఊరేగుతాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్లపక్ష విదియనాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది.
జగన్నాథ రథయాత్ర విశేషాలివే
జగన్నాథుడు కొలువుదీరే రథం పేరు నందిఘోష, బలభద్రుడు కొలువు తీరే రథం పేరు తాళ ధ్వజ, సుభద్రాదేవి కొలువు తీరే రథం పేరు దర్ప దళనగా చెబుతారు. సుమారు 45 అడుగుల ఎత్తు ఉండే ఈ రథాలను వేప, సాల్, ధౌరా, సింబల్ వంటి ప్రత్యేకమైన కలపతో ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు.

మహారాజు బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేసే ఆచారం
స్వామివారు గుండిచా మందిరం లో తొమ్మిది రోజులపాటు బస చేసి అనారోగ్యం తర్వాత తిరిగి కోలుకుని 9వ రోజున తిరిగి వచ్చే యాత్రను బహుడా యాత్ర అంటారు. ఇక పూరి జగన్నాధుని రథోత్సవానికి ముందు పూరి గజపతి మహారాజు చేరా పహేరా అనే పవిత్ర ఆచారాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేసి రాజైన సామాన్యుడైన భగవంతుడు ముందు ఒకటేనన్న సంకేతాన్ని తెలియజేస్తారు.
భగవంతుడే భక్తుల వద్దకు వచ్చే విశేష ఉత్సవం
పూరి జగన్నాధుని రథయాత్ర జీవితానికి సంబంధించి ఎన్నో విశేషమైన తాత్విక అంశాలను తెలియజేస్తుంది. అందరూ భక్తులు కలిసి రథాన్ని లాగడంతో పేద, ధనిక, కుల, మత తారతమ్యం లేకుండా భగవంతుడు ముందు అందరూ ఒకటే అనే అర్థం ఇందులో ఉంది. అంతేకాదు సహజంగా భక్తులు భగవంతుని వద్దకు వెళతారు.. కానీ భగవంతుడే భక్తుల వద్దకు వచ్చే విశేష ఉత్సవం ఇది.
జగన్నాథ రథం ఇచ్చే గొప్ప సందేశం ఇదే
ఇందులో ఎవరికైతే భగవంతుడి పట్ల భక్తి ఉంటుందో, ప్రేమ ఉంటుందో వారి చెంతకు భగవంతుడు వస్తాడు అన్నది సంకేతం. జగన్నాథ రథయాత్రలో మరో విశేషం జగన్నాథుని రథం ముందుకే కదులుతుంది. మనం కూడా జీవితంలో ధైర్యంగా, ప్రేమగా, మానవతా పూర్వకంగా జగన్నాథుని రథం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో అదేవిధంగా ముందుకు వెళ్లాలి అన్న సంకేతం ఇందులో ఉంది.
ప్రేమతత్వాన్ని, ధర్మ జీవనాన్ని నింపాలనేదే జగన్నాధుని రథయాత్ర
మానవ శరీరాన్ని రథంగా ఇంద్రియాలను గుర్రాలుగా, మనసు అనే పగ్గం తో కంట్రోల్ చేస్తూ ముందుకు నడిపించడం అంటే మన జీవితాన్ని ముందుకు నడిపించడానికి మనం చేయాల్సింది ఏంటో చెప్పడం కూడా జగన్నాధుని రథయాత్ర యొక్క విశేషం. ఎన్నో నిగూఢమైన అర్థాలు ఉన్న జగన్నాధుని రథయాత్ర ప్రతి ఒక్కరిలోను ప్రేమ తత్వాన్ని, ధర్మ జీవనాన్ని నింపాలని ప్రబోధిస్తుంది. మానవత్వంతో, సేవే పరమ ధర్మంగా ముందుకు సాగాలనే విషయాన్ని చెబుతోంది.












Click it and Unblock the Notifications