ససేమీరా: ఇద్దరు బెట్టు వీడినా... మెట్టు దిగని కొణతాల

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, విశాఖపట్నంకు చెందిన కొణతాల రామకృష్ణ, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖలు ఆది నుండి జగన్ వెంటే నడుస్తున్నారు. ఇటీవల వారు ముగ్గురు కొంత అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆది నుండి ఆయా జిల్లాల్లో వారిదే పట్టు. వారి చెప్పిందే వేదం. అయితే కొంతకాలంగా సొంత జిల్లాలో వారి పప్పులు ఉడకపోవడంతో అధిష్టానంపై అలకబూనారు. తమ తమ జిల్లాల్లో తమ వర్గం వారికి కాకుండా ఇతరులకు పదవులు కట్టబెట్టడం తదితర కారణాల వల్ల వారు అసంతృప్తికి లోనయ్యారు.
ఇందులో మేకపాటి, కొండా సురేఖలు ఇప్పుడు చల్లబడ్డారు. వారికి హామీ వచ్చిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే వారు ప్రస్తుతం అలకపాన్పు దిగారు. మేకపాటికి జిల్లా ఆధిపత్యంపై స్పష్టమైన హామీ వచ్చినప్పటికీ కొండా దంపతులకు మాత్రం రాలేదట. అయినా రాజకీయ సమీకరణాల కోసం దిగి రాక తప్పలేదు. ప్రస్తుతానికి మేకపాటి, కొండా సురేఖలు చల్లబడ్డారు.
అయితే కొణతాల రామకృష్ణ మాత్రం మెట్టు దిగడం లేదట. టిడిపి నుండి దాడి వీరభద్ర రావు తమ పార్టీలోకి రావడాన్ని ఆయన మొదట నుండి సహించలేక పోతున్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని ఓ సమయంలో ప్రచారం కూడా సాగింది. దీనిపై మంత్రి గంటా శ్రీనివాస రావు, కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా స్పందించారు. ఆయన వస్తే ఆహ్వానిస్తామన్నారు. కానీ ఆయన నుండి ఎలాంటి స్పందన లేదని కూడా గంటా చెప్పారు. ఖచ్చితంగా ఆయన బయటకు చెబితే మేం స్పందిస్తామని గంటా అన్నారు.
అందుకు కొణతాల వర్గం కూడా ఇది రహస్యంగా జరుపుకోవాల్సిన చర్చలు అని సమాధానం చెప్పారట. అందుకు గంటా కూడా నిజంగానే అసంతృప్తి ఉంటే, చర్చలు జరపాలనుకుంటే జగన్కు బెయిల్ రానప్పుడు మళ్లీ మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారట. అప్పటి నుండి కొణతాల పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదని అంటున్నారు. తద్వారా ఆయన తన అసంతృప్తిని తెలియజేస్తున్నారని అంటున్నారు.
దాడి రాకపై అసంతృప్తితో ఉన్న కొణతాల కాంగ్రెసులోకి వెళ్తారనే ప్రచారం ఓ వైపు సాగుతున్న సమయంలో అతను సుప్రీం కోర్టులో జగన్కు బెయిల్ రాకపోవడంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దీనిని కాంగ్రెసు నేతలు ప్రశ్నించారట. అప్పటి నుండి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఆ తర్వాత పలు సమావేశాలకు కొణతాల డుమ్మా కొట్టడం గమార్హం.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్న కొణతాల ఈ నెల 13న జరిగిన సమావేశానికి రాలేదు. షర్మిల పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సమయంలోను ఆయన పశ్చిమ గోదావరి జిల్లా సభకు రాలేదు. ఈ రోజు విజయమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశానికి కూడా కొణతాల హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరోవైపు కొండా దంపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications