స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్ను వెంటాడి పట్టుకున్నారు
మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - చాలా వారాలుగా వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వారిపై కన్నేసిన పోలీసులు వారిని వెంటాడారు. శ్రీశాంత్, చవాన్ బుక్కీ మిథానియాను కలవడానికి లోనికి వెళ్లారు. పోలీసులు బార్ వెలుపల నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఢిల్లీ పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్ సహాయం తీసుకున్నారు. శ్రీశాంత్, అతని ఇద్దరు సహచరుల ప్రతి కదలికపై పోలీసులు కన్నేసి ఉంచారు. స్టేడియం నుంచి బయటకు వెళ్లిన శ్రీశాంత్ను అనుసరించారు.
పబ్లో అర గంట పాటు ఉండి అంకిత్ చవాన్ పబ్ నుంచి బయటకు వచ్చాడు. ఓ పోలీసు బృందం అతన్ని అనుసరించింది. ఇంటర్కాంటినెంటల్ హోటల్ చేరుకోగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అప్పటికి శ్రీశాంత్ పబ్లో మిథానియాతోనే ఉన్నాడు. గురువారం తెల్లవారు జామున ఒంటి గంటన్నర ప్రాంతంలో పబ్ నుంచి బయటకు వచ్చాడు. కారులో ఎక్కి డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. మిథానియా కూడా బయటకు వచ్చి మరో కారులో బయలుదేరాడు. వారిని పోలీసులు అనుసరించారు.
మోతీ మహల్ వద్ద పోలీసులు శ్రీశాంత్ కారును అడ్డగించారు. కారులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వారిని పోలీసులు ప్రశ్నించారు. ఈలోగా ఓ పోలీసు బృందం లింకింగ్ రోడ్డు వద్ద మిథానియాను అరెస్టు చేశారు. శ్రీశాంత్ జట్టు సహచరుడు చండిలను ట్రైడెంట్ హోటల్లో అరెస్టు చేశారు.
శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిల ఫిక్స్ చేసిన మూడు మ్యాచుల క్లిప్పింగ్లను పోలీసులు మీడియాకు చూపించిన విషయం తెలిసిందే. క్రికెటర్లకు, బుక్కీలకు మధ్య జరిగిన సంభాషణలను కూడా పోలీసులు వెల్లడించారు. క్రికెటర్ల పాత్రపై క్లూలను రాబట్టడానికి పోలీసులు వంద గంటల ఆడియో క్లిప్పింగులను పరిశీలించారు.
చండిల 20 లక్షల రూపాయలు, శ్రీశాంత్ 40 లక్షల రూపాయలు, చవాన్ 50 లక్షల రూపాయలు మ్యాచ్ ఫిక్సింగ్కు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.