భారత విద్యార్థి రేప్, హత్య: ఆస్ట్రేలియన్కు 45ఏళ్లు జైలు
డానియెల్ స్టాని రెగినాల్డ్ అనే 21 యేళ్ళ యువకుడికి అత్యంత కిరాతకంగా వ్యవహరించినందుకు కోర్టు ఆ శిక్ష వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి - సిడ్నీలోని క్రోడాన్ ఎడెల్విస్ వీధిలో తన అపార్టులో నివసిస్తున్న 24 యేళ్ళ భారతీయ విద్యార్థి తోషా తక్కర్పై కన్నేశాడు.
వీరిద్దరు అకౌంటెన్సీలో సహ విద్యార్థులు కావడంతో ఇరువురి మధ్య మాటలు ఉండేవి. దీన్ని ఆసరాగా తీసుకున్న రెగినాల్డ్ 2011 మార్చి 21న కాపు కాచి ఆమెపై అపార్ట్మెంట్లో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కేబుల్ వైరుతో తక్కర్ను హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ఒక సూట్ కేసులో పెట్టి, పర్రమట్ట నదిలో విసిరేశాడు. దోషి అత్యంత క్రూరంగా ఆమె గొంతు నులిమి చంపాడని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసును విచారించిన న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టు నిందితుడు స్టానికి 45 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అందులో 30 యేళ్ల పాటు పెరోల్కు అవకాశం లేని శిక్షను ఖరారు చేసింది. అతను 30 ఏళ్ల నాన్ పెరోల్ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అతనికి 2041 మార్చిలో పెరోల్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.