తెరాసను చీల్చేందుకు సిఎం కుట్ర, రఘు పావు: ఈటెల

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు రఘునందన్తో మాట్లాడిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రితో కూడి రఘునందన్ కుట్రలో భాగం పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ గొంతుతో రఘునందన్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు.
హరీష్ రావుపై చేసిన ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని, సిడిలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ద్రోహుల మాదిరిగా, దుర్మార్గంగా గొంతు కోసే పనిచేయవద్దని ఆయన రఘునందన్కు సలహా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంపై, తెరాసపై విషప్రచారం చేస్తే వారే మాడి మసైపోతారని ఆయన అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి చేతిలో కొంత మంది శిఖండులు తమపై ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. రఘునందన్ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరుస్తాయని ఆయన అన్నారు.
ఆంధ్ర సంపన్నులు, రాజకీయ నాయకుల గొంతుగా రఘునందన్ రావు మారారని ఆయన అన్నారు. రఘునందన్ రావును ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతామని ఆయన చెప్పారు. పద్మాలయా స్టూడియో వద్ద హరీష్ రావు 80 లక్షల రూపాయలు తీసుకున్నారని రఘునందన్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications