స్పై ఆపరేషన్, కెకె పక్కా ప్లాన్: చిక్కుల్లో కెసిఆర్

హరీష్ రావుకు, కెసిఆర్కు మధ్య చిచ్చు పెడితే తెరాసను బలహీనపరచవచ్చుననే వ్యూహంతోనే ప్రత్యర్థులు వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే రఘునందన్ రావు ఆరోపణలు ముందుకు వచ్చాయని చెబుతున్నారు. అదే సమయంలో పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పేరును కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు. తనంత తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని ఆయన చెప్పారు. సోమవారం నుంచి ఒక్కో ఏజెన్సీ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఆధారాలు బయటపెడుతానని ఆయన చెప్పారు.
కాగా, రఘునందన్ రావు శనివారం సాయంత్రం డిజిపి దినేష్ రెడ్డిని కలిశారు. తెరాసపై ఆరోపణలు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, అసాంఘిక శక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాయని ఆయన డిజిపికి ఫిర్యాదు చేశారు. తనకు తగిన రక్షణ కల్పించాలని ఆయన డిజిపిని కోరారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆయన చెప్పారు. తెరాసపై కొందరు స్పై ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, వారే తనకు సిడీలు ఇచ్చారని రఘునందన్ రావు చెప్పారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ బయటపెడుతానని ఆయన చెప్పారు. తాను ఎటువంటి స్పై ఆపరేషన్ నిర్వహించలేదని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా పిలిచి గంటకు పైగా చర్చలు జరపడం కూడా కెసిఆర్ ఆశలపై నీళ్లు చల్లాయి. కెసిఆర్కు చెక్ పెట్టే వ్యూహంలోనే భాగంగానే కెకెతో సోనియా ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. దీంతో తెరాసలో చేరే విషయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు పార్టీలో తెలంగాణవాదం వినిపిస్తున్న నాయకులకు కేశవరావు నాయకత్వం వహిస్తున్నారు. తనకు రాజ్యసభ టికెట్ నిరాకరించినప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై తెలంగాణ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించారు. తాను తెరాసలో చేరుతాననే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దీంతో కెసిఆర్ కెకెతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే, అకస్మాత్తుగా కెకె వెనక్కి తగ్గారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు పార్టీలోని తెలంగాణా వాదులనందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను సోనియా కెకెకు అప్పగించి ఉండవచ్చని భావిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణా వచ్చే అవకాశం ఉందని, అందువల్ల నేతలంతా ఐక్యంగా ఉండి పార్టీని గెలిపించాలని కోరినట్టు సమాచారం. కెకెతో మంతనాల ద్వారా తెలంగాణ నేతల వలసలకు సోనియా బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు. దీంతో తెరాసలోకి కాంగ్రెసు నేతల వలసలు ఆగిపోయినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications