కాంగ్రెస్ జెండా ఎందుకు?: హరీష్, మాట మార్చిన చాకో
చాకోకు కామన్ సెన్స్ లేదన్నారు. తెలంగాణను కాంగ్రెసు మినిమమ్ ప్రోగ్రామ్లో పెట్టిందే కాంగ్రెస్ అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఇక వేచి చూడటం మానుకోవాలన్నారు. ఎంపీలు ఇప్పటికైనా కళ్లు తెరవడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఇక గడువులు మానుకొని గడప దాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై ఇంతలా మాటలు మార్చిన పార్టీ కాంగ్రెసు తప్ప మరొకటి లేదన్నారు.
తెలంగాణపై ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడటమే కాకుండా.. నేతలు కూడా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజమైన తెలంగాణవాదులు ఎవరు కాంగ్రెసు పార్టీలో ఉండరని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కాంగ్రెసు నేతలు ఇంకా నమ్మడం చూస్తుంటే జాలేస్తుందన్నారు. సిఎంపిలో తెలంగాణ లేదా లేక చాకోకు కామన్ సెన్స్ లేదా అని ప్రశ్నించారు.
పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిన నీలం సంజీవ రెడ్డికి శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నారని, అదే స్వర్గీయ పివి నరసింహ రావుకు మాత్రం ఎందుకు జరపరని ప్రశ్నించారు. నీలంకు ఓ న్యాయం, పివికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఒప్పందాలు తుంగలో తొక్కినందుకు నీలంకు ఉత్సవాలు జరుపుతున్నారా అన్నారు. నీలం, కాసు పుట్టిన రోజులు ఆంధ్రులకు ఉత్సవాలయితే తమకు పీడ దినాలు అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందన్నారు.
తగ్గిన చాకో
కాంగ్రెసు పార్టీ అజెండాలో తెలంగాణ అంశం లేదన్న కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో తగ్గారు. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెసు అజెండాలో తెలంగాణ ముఖ్యమైన అంశమని, తెలంగాణ ప్రజల మనోభావాలు తమకు తెలుసునని, చర్చల ప్రక్రియ ముగిసిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు.