జగన్ పార్టీలో నెంబర్ టు రగడ: సురేఖXశోభానాగిరెడ్డి?
ప్రధానంగా వరంగల్ జిల్లా ముఖ్యనేత, మాజీ మంత్రి కొండా సురేఖ, కర్నూలు జిల్లా ముఖ్యనేత శోభా నాగి రెడ్డిలకు మధ్య ఈ ఆధిపత్య పోరు నడుస్తోందని అంటున్నారు. జగన్ పార్టీ స్థాపించిన సమయంలో కొండా దంపతులు, భూమా దంపతులు ప్రధానంగా ఉన్నారు. మొదటి నుండే వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని అంటున్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టిన విజయమ్మ లేదా జగన్ పక్కన సురేఖ, శోభా నాగి రెడ్డిలు ఉండేవారు.
గత కొన్నాళ్లుగా పార్టీ పట్ల కొండా దంపతులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో శోభా నాగి రెడ్డి నెంబర్ టూ స్థానాన్ని భర్తీ చేశారట. అయితే, నాలుగు రోజుల క్రితం కొండా దంపతులు జైలులో ఉన్న జగన్ను కలిసి చల్లబడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీ పట్ల అసంతృప్తికి గురై చల్లబడ్డ వీరికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి. దీంతో మరోసారి వీరిమధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొండా సురేఖ మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న తర్వాత శోభా నాగి రెడ్డి ఒకింత అసంతృప్తికి గురయ్యారట. ఇటీవల విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సురేఖ రాగా శోభా నాగి రెడ్డి గైర్హాజరయ్యారు. ఇతర కారణాల వల్లనే ఆమె రాలేదని చెబుతున్నప్పటికీ అసహనం కూడా కారణం కావచ్చునని అంటున్నారు.