కెసిఆర్ దూకుడుకు కళ్లెం: బిజెపికి పార్టీల నేతల ఆఫర్స్
అధికార కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇలా అన్ని పార్టీల నుండి బిజెపిలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారట. అందుకు రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. తమ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఒక కారణం కాగా.. తెరాసకు ధీటుగా తెలంగాణవాదం వినిపిస్తుండటం మరో కారణమంటున్నారు. ఇటీవల బిజెపి తెలంగాణవాదం గ్రామస్థాయిలో చొచ్చుకుపోతోంది.
పాలమూరులో బిజెపి గెలవడంతో పాటు పరకాలలో కాంగ్రెసు కంటే మెరుగ్గా ఆ పార్టీ ఉండటమే కారణమంటున్నారు. ఇటీవల తెరాసకు ధీటుగా బిజెపి కూడా చొచ్చుకుపోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదంతో గెలుపొందాలన్నా, తెరాస లేదా ఇతర పార్టీలో టిక్కెట్ రాకున్నా బిజెపిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఆయన వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. బిజెపి నుండి ఆ హామీ కూడా లభించిందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కృత నేత రఘునందన రావు జహీరాబాద్ పార్లమెంటు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. బిజెపి తెలంగాణవాదానికి తోడు జిల్లాలో తన ఇమేజ్ గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఆయన టిడిపిలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్నా బిజెపి జహీరాబాద్ టిక్కెట్ పైనే కన్నేశారని అంటున్నారు.
మొదటి నుండి తెలంగాణ కోసం పని చేస్తున్న తమకు కెసిఆర్ టిక్కెట్ ఇవ్వని పక్షంలో తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపిలోకి వెళ్లాలని తెరాస నేతలు పలువురు భావిస్తున్నారట. ఇప్పటికే వారు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పేరును సంపాదించుకున్నారు. మరోవైపు టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కాకుండా తెలంగాణ వాదం బిజెపిలోకి వెళ్లడం కలిసి వస్తుందని భావిస్తున్నారట.
ఇటీవల పలువురు టిడిపి, కాంగ్రెసు సీనియర్ నేతలు తెరాసలో చేరుతున్నారు. వారి పట్ల తెరాస ఆశావహులు ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెదక్, వరంగల్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు తెరాస నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు బిజెపి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మల్కాజిగిరి పార్లమెంటు టిక్కెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారట. వారిపై బిజెపిలో చర్చ సాగుతున్నట్లుగా సమాచారం. టిక్కెట్లిస్తామంటే బిజెపిలోకి వచ్చేందుకు చాలామంది వరుసలో ఉన్నారట.