సర్వే: లోకసభ ఎన్నికల్లో కెసిఆర్, జగన్లదే హవా
కాంగ్రెసు పార్టీ 26 సీట్లను కోల్పోయి కేవలం 7 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. తెలుగుదేశం పార్టీ గతంలో కన్నా మెరుగుపడినట్లు సర్వే తేల్చింది. ప్రస్తుత లోకసభలో టిడిపికి ఆరు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే పది స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. రెండు స్థానాలు మాత్రమే ఉన్న తెరాస మరో పది స్థానాలను అదనంగా గెలుచుకుంటుందని చెప్పింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రస్తుతం రెండు లోకసభ స్థానాలున్నాయి. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అస్తిత్వంలోనే లేదు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే 11 స్థానాలు గెలుస్తుందని తెలిపింది.
మజ్లీస్ ఒక్క సీటు, బిజెపి ఒక్క సీటు గెలుచుకుంటాయని సర్వే తేల్చింది. మజ్లీస్ 2009 ఎన్నికల్లో హైదరాబాద్ లోకసభ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఆ పార్టీ అదే స్థానాన్ని గెలుచుకునే అవకాశాలున్నాయి. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బిజెపికి ఈసారి ఓ సీటు వస్తుందని సర్వే అంచనా వేసింది.
హెడ్లైన్స్ టుడే, సీ వోటర్ సర్వే ప్రకారం - వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సానుభూతి ఓట్లతోనే విజయం సాధిస్తుంది. వైయస్ జగన్ వల్ల కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. తెలంగాణవాదం కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లాభపడే పరిస్థితి ఉంది. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్దగా లాభపడే అవకాశాలు లేనట్లు సర్వేను బట్టి అర్థమవుతోంది.