మంగళసూత్ర ధారణపై కెసిఆర్ సంచలన వ్యాఖ్య
బుధవారం ఉదయం మెదక్ జిల్లా సిద్దిపేటలో తెరాస మాజీ శానససభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు, కూతుళ్ల స్టేజ్ మ్యారేజీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురాణల్లో ఎక్కడా మంగళసూత్రధారణ లేదని, గజినీ మహ్మద్ కాలంలో హిందూ మహిళలపై దాడులతో రక్షణ కోసం మంగళసూత్రధారణ పద్దదతి వచ్చిందన్నారు. నిజమైన పెళ్లి అంటే స్టేజ్ మ్యారేజీ అని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెసు నేతలతో ఒరిగేదేమీ లేదని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ సమాజం స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగిందని, వచ్చే ఎన్నికల్లో గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.
అన్ని సర్వేలు కూడా తమ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని, 2014 ఎన్నికల్లో తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణకు చంద్రబాబు చేసినంత మోసం మరెవరూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ అడిగితే తెలంగాణ రైతులను కాల్చి చంపిన నరహంతకుడు చంద్రబాబు అని ఆయన అన్నారు.
తుపాకులకు ఎదురు నిలిచి విద్యార్థులు, చావు నోట్లో తలెపెట్టి కెసిఆర్ తెలంగాణ సాధిస్తే జగన్, కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలతో అర్థరాత్రి ఎలా ప్రకటిస్తారని అడ్డుకున్నారని, తద్వారా వేయి మంది తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకున్నారని ఆయన అన్నారు.