అరుణపై సమర తనయుడు: కెసిఆర్ సీట్లో నాగం

సమరసింహారెడ్డి తనయుడు రాఘవేంద్ర రెడ్డి గద్వాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. గద్వాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం డికె అరుణ కాంగ్రెసు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమరసింహారెడ్డి సోదరుడు భరత్ సింహా రెడ్డి భార్యనే డికె అరుణ. చాలా కాలంగా ఇరు కుటుంబాల మధ్య పొసగడం లేదు. రాజకీయంగా సమరసింహారెడ్డి వెనక్కి వెళ్లి డికె అరుణ ముందుకు వచ్చారు. డికె అరుణను ఓడించేందుకు సమరసింహారెడ్డి గద్వాలలో తన తనయుడిని రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమరసింహారెడ్డి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. చురుకైన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత ఆయన వివిధ పార్టీల్లో చేరారు. కానీ ఏ పార్టీలోనూ ఇమడలేకపోయారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. చంద్రబాబు మహబూబ్నగర్ జిల్లా పాదయాత్ర సందర్భంగానే సమరసింహారెడ్డి టిడిపిలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన చేరలేదు. కారణాలేమిటో తెలియదు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ లోకసభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా నాగం జనార్దన్ రెడ్డి పోటీకి దిగనున్నారు. ఆయన వచ్చే నెల 3వ తేదీన తన తెలంగాణ నగారా సమితిని బిజెపిలో విలీనం చేసి, బిజెపిలో చేరబోతున్నారు. ఆ విషయాన్ని నాగం జనార్దన్ రెడ్డి గురువారం వరంగల్లో చెప్పారు.












Click it and Unblock the Notifications