చంద్రబాబును స్పాట్ ఫిక్సర్ శ్రీశాంత్తో పోల్చిన అంబటి

జగన్ ఆర్థిక నేరస్తుడని, ఉగ్రవాది అని ఇష్టానుసారంగా ఆనం మాట్లాడుతున్నారని, ఇవన్నీ కాంగ్రెస్ ఆయనతో మాట్లాడిస్తోందని ధ్వజమెత్తారు. నేరారోపణలు చేసినంత మాత్రాన ఓ వ్యక్తిని నేరస్తుడని చెప్పడం భావ్యం కాదని, కోర్టులో నేరం రుజువైతేనే నేరస్తుడవుతాడని, అలా తమను కళంకితులనడం సరికాదంటూ సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు అన్నారని, ఇదే అంశం జగన్కు ఎందుకు వర్తించదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయం, జగన్కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వంలోని మరికొందరు సిగ్గు తెచ్చుకుని మాట్లాడాలన్నారు. జగన్ కేసు సమయంలో.. కేబినెట్ సమష్టి నిర్ణయమన్న వాదనను వినిపించినట్లయితే.. ఇవాళ కాంగ్రెస్ మంత్రులకు ఈ గతి పట్టేది కాదన్నారు. చంద్రబాబు కేసు విషయంలో ప్రభుత్వం వాదనలు వినిపించకుండా టిడిపి అధినేతకు సహకరించిందని, అందువల్లే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి ఓటు వేయలేదని ఆయన చెప్పారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జగన్ను ఏడాదిగా జైలులో నిర్బంధించినా, పార్టీ కేడర్ను అణగదొక్కడానికి ఎన్నో కుయుక్తులు పన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా పార్టీ ధైర్యంగా ముందుకు సాగుతోందని, రాబోయే అన్ని ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని చెప్పారు.
అవినీతి రహిత ప్రభుత్వంకోసం పోరాడతానని, అదే తన కర్తవ్యమని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని అంబటి అన్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన బాబు ఇలా మాట్లాడుతుండటం విచిత్రమన్నారు. అసలు రాజకీయాల్లో ఖర్చులు పెంచింది ఆయనే అన్నారు. బాబు నీతివాక్యాలు చెబుతున్నారని, ఆయన రెండెకరాలు లేదా హెరిటేజ్ నుంచి ఇన్ని వేల కోట్లు సంపాదించి ఖర్చు పెడుతున్నారా? అని అంబటి ప్రశ్నించారు.
దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ తెలుగుదేశమని స్వయంగా ఆ పార్టీ నాయకులే చెప్పి వెళ్ళిపోతున్నారన్నారు. బాబు పైకి గంభీరంగా తాను గేట్లు తెరిస్తే చాలామంది వస్తారని చెబుతున్నారని, అలాంటి పరిస్థితే ఉంటే ఎన్టీఆర్ హయాం నుంచి పనిచేస్తున్న కడియం శ్రీహరి, దాడి వీరభద్ర రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులాంటి నేతలు ఎందుకు వెళ్లిపోతారని ప్రశ్నించారు. మూడవసారి కూడా అధికారం కోల్పోతే టిడిపి జెండా ఎత్తేయాల్సి వస్తుందన్నారు.
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని, అంటే 2014 ఎన్నికల ఖర్చుల కోసం ఆయన నోట్లన్నింటినీ వందలుగా మార్చుకుని సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడును అంబటి క్రికెటర్ శ్రీశాంత్తో పోల్చారు. బాబు కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications