పెరుగుతున్న ఒత్తిడి: మొండికేస్తున్న శ్రీనివాసన్
ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలనే ఒత్తిడి ఎన్ శ్రీనివాసన్పై పెరుగుతోంది. అయితే, ఆయన మాత్రం మొండికేస్తున్నారు. అయితే, శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగాలని బోర్డు సభ్యులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాసన్ స్థానంలో బిజెపి నేత అరుణ్ జైట్లీ బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
శ్రీనివాసన్ను తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముందు ఎవరు చొరవ తీసుకుంటారనే అయోమయం బిసిసిఐలో కొనసాగుతోంది. బిసిసిఐ నిబంధనల ప్రకారం - అనూహ్యమైన పరిస్థితిలో బిసిసిఐ అధ్యక్షుడు తప్పుకుంటే అతని స్థానంలో ఉపాధ్యక్షుడు ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇలా చూస్తే, శివలాల్ యావద్ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలుంటాయి. రాజీవ్ శుక్లా పేరు కూడా బిసిసిఐ అధ్యక్ష పదవికి వినిపిస్తోంది.

కాగా, తాను రాజీనామా చేయబోనని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని శ్రీనివాసన్ అంటున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. అల్లుడు గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన నేపథ్యంలో శ్రీనివాసన్ నుంచి ఒత్తిడి మరింత పెరిగింది. తన అల్లుడిని అడ్డం పెట్టుకుని తనపై ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. తన అల్లుడిని కలవడానికి ఆయన మధురై నుంచి ముంబైకి బయలుదేరారు.
కాగా, శ్రీనివాసన్పై ఐపియల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ గొంతు పెంచారు. గురునాథ్ అరెస్టుకు బాధ్యత వహించి శ్రీనివాసన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సొంతం చేసుకోవడానికి శ్రీనివాసన్ నిబంధలను మార్చారని ఆయన విమర్సించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications