భయపడం: మావోల దాడిపై రాహుల్, పిసిసి చీఫ్ హత్య
కిడ్నాప్ చేసిన పిసిసి అధ్యక్షుడి హత్య
శనివారం సాయంత్రం మావోలు దాడి చేసి పలువురిని హతమార్చి మరికొందరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్కు గురైన వారిలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నందకుమార్, ఆయన తనయుడు దినేష్ ఉన్నారు. వారిని నక్సల్స్ హతమార్చారు. కొద్ది దూరం తీసుకు వెళ్లాక వారిని హత్య చేశారు.
వారి మృతదేహాలు సుకుమా జిల్లా దర్బాఘాట్ వద్ద పోలీసులు కనుగొన్నారు. కిడ్నాపైన వారిలో తొమ్మిది మంది వరకు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది మావోల చెరలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో దాదాపు 1200 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ రోజు పదకొండు గంటలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రానున్నారు.
శనివారం సాయంత్రం కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా మావోలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కాంగ్రెసు ముఖ్య నేత, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదిలియార్తో పాటు పలువురు మృతి చెందారు. కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు ప్రత్యేక చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించారు. మావోల దాడిని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ బందుకు పిలుపునిచ్చింది.