అలవాటు చేశాడు: విందూ, గురునాథ్ ఫేస్ టు ఫేస్
విందూనే తనకు బెట్టింగ్స్ను పరిచయం చేశారని గురునాథ్ చెప్పగా... గురునాథ్ తరఫున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విందూ చెప్పినట్లుగా సమాచారం. నాలుగు మ్యాచులలో తాను కోటి రూపాయలు నష్టపోయినట్లు కూడా గురునాథ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఐపిఎల్ బెట్టింగ్స్ వ్యవహారంలో అరెస్టైన గురునాథ్ మీయప్పన్పై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ముంబైకి చెందిన ప్రత్యేక బృందం చెన్నైలోని ఆయన నివాసంలో ఆదివారం రోజంతా తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్కు సంబంధించిన ఆధారాల కోసం వారు తనిఖీలు నిర్వహించారు.
శ్రీశాంత్ కస్టడీ పొడిగింపు
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టైన క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలాతో పాటు పలువురు బుకీలను మరో రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కుట్రను బట్టబయలు చేయడానికి వీరిని ప్రశ్నించాల్సి ఉందన్న పోలీసులు విజ్ఞప్తి మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే కేసులో అరెస్టైన మాజీ రంజీ ఆటగాడు బాబూరావు యాదవ్ను కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించారు. ఆయనకు వచ్చే నెల 4వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. మిగతా నిందితులైన క్రికెటర్ చవాన్, బుకీలు జిజు జనార్ధన్ తదితరులను ప్రశ్నించేదేమీ లేదని పోలీసులు తెలియజేయడంతో వారికి కూడా అదే తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. శ్రీశాంత్, చవాన్లు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.