జగన్కు దూరమయ్యారా?: బాబుపై లక్ష్మీ పార్వతి కూల్
దీంతో ఆమె ఆ పార్టీకి దూరమయ్యారా? అనే ప్రశ్నలు పలువురిలో మొలకెత్తుతున్నాయి. జగన్ తన కొడుకు లాంటి వాడని, ఆయనకు అండగా ఉంటానని చెప్పిన లక్ష్మీ పార్వతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవని చెబుతున్నారు. అదే సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన స్పందిస్తున్న తీరు కూడా అనుమానాస్పదంగా ఉందంటున్నారు.
ఇరవై రోజుల క్రితం పార్లమెంటులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టినప్పుడు లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయే ప్రయత్నం చేశారు. చంద్రబాబు పక్కన నిలబడిన ఆమె ఆయనను అడిగి చేతిలో ఉన్న గులాబీ రేకుల్లో సగం తీసుకొని ఎన్టీఆర్ విగ్రహంపై వేశారు. కుటుంబ సభ్యులందరిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఆహ్వానం అందలేదని పురంధేశ్వరిపై అంతకుముందు నిప్పులు చెరిగిన లక్ష్మీ పార్వతి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. బాబుకు ఆహ్వానం అందక పోవడంపై కూడా ఆమె పురంధేశ్వరిని ప్రశ్నించారు.
ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందకపోవడంపై ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు అంటేనే ఒంటికాలిపై లేచే లక్ష్మీ పార్వతి.. ఇటీవల ఆయన పట్ల కాస్త కూల్గానే మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ రోజు జూనియర్కు ఆహ్వానం అందక పోవడంపై మాట్లాడుతూ.. బాబు కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని పోవాలని, అప్పుడే టిడిపికి లబ్ధి చేకూరుతుందని సలహా ఇచ్చారు.
ఇటీవల లక్ష్మీ పార్వతి జగన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, కుటుంబ సభ్యులతో మమేకం అయ్యే ప్రయత్నాలు చేయడం, బాబు పట్ల సున్నితంగా స్పందించడం చూస్తుంటే ఆమె వైఖరి మార్చుకుందా అనే ప్రశ్న ఉదయిస్తోందని అంటున్నారు. టిడిపికి మద్దతివ్వకున్నా, చంద్రబాబుతో కలువకున్నా.. కనీసం కుటుంబ సభ్యుల్లో కలిసి పోవాలని ఆమె బలంగా కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.