'సత్యం వధ ధర్మం చెర: మహాత్ముడు, మండేలా, జగన్'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టై ఏడాది పూర్తయినందున ఆ అరెస్టును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మంగళవారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేసింది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం ముగిసింది. ఈ దీక్షలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతిలు పాల్గొన్నారు.
ఈ దీక్షా ప్రాంగణంలో నగర పార్టీ నేత ఒకరు ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చనీయాంశం, వివాదాస్పదం అయింది. ఓ బ్యానర్లో జాతిపిత మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఫోటోలతో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ఏర్పాటు చేశారు. 'దేశం కోసం మహాత్మా గాంధీ, జాతి కోసం నెల్సన్ మండేలా, ఇచ్చిన మాట కోసం జగన్ జైలుకు వెళ్లినట్లు బ్యానర్ పెట్టారు. దీనిని పలువురు ఆసక్తిగా చూశారు. గతంలోను మహాత్మా గాంధీని, జగన్ను పోలుస్తూ ఆ పార్టీ నేతలు బ్యానర్ను కట్టారు.

మరోవైపు ఈ దీక్ష వెలవెల పోయినట్లుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. జగన్ ఏడాదిగా జైల్లో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందని చెప్పడానికి విజయమ్మ చేపట్టిన ప్రజా నిరసన దీక్ష అద్దం పట్టిందని రాసింది. పది రోజుల ముందు ఖరారు చేసినా దీక్షకు ప్రజలే కాకుండా.. పార్టీ ముఖ్యులు రాలేదని, కొందరిని బతిమాలి కూర్చోబెట్టారని రాసింది.
దీక్షలో పాల్గొన్న విజయమ్మ, భారతిలు కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, బయటకు తీసుకు రావడానికి రోడ్లపైకి ప్రజలు వచ్చి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications