ఫ్యామిలీ ట్రబుల్స్పై తాడోపేడో: జూ.ఎన్టీఆర్పై బాబు దృష్టి
సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో నారా - నందమూరి కుటుంబ సభ్యుల సమస్యలు పార్టీకి ఇబ్బంది కాకుండా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సమస్య ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే టిడిపి కార్యకర్తల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో గందరగోళం చెలరేగే పరిస్థితి ఉందని చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు ఓ ముగింపు పలకాలని బాబు భావిస్తున్నారట.
అందులో భాగంగానే ఆయన బుధవారం రాత్రి బాలకృష్ణతో భేటీ అయినట్లుగా సమాచారం. వారి భేటీలో హరి, జూనియర్ల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వారి వైఖరి పట్ల పలువురు తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నప్పటికీ విభేదాలు మరింత రట్టవుతాయేమోననే ఉద్దేశ్యంతో కిమ్మనకుండా ఉంటున్నారట. జూనియర్, హరికృష్ణలు పార్టీలో ఉంటే ఉండవచ్చు లేదంటే వెళ్లిపోవచ్చునని చెప్పే సమయం వచ్చిందని అధినేతకు పలువురు సూచిస్తున్నారట.
ఎన్నికల సమయం దగ్గరవుతున్నకొద్ది వారి గందరగోళం చెలరేగితే పార్టీకే నష్టమని, అలా కాకుండా వారిపై ఓ నిర్ణయానికి వస్తే కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారట. కుటుంబ సభ్యుల్లో కేవలం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు మాత్రమే అసంతృప్తిగా ఉన్నారని, మిగతా వారంతా టిడిపికే మద్దతిస్తారని చెబుతున్నారట.
కల్యాణ్ రామ్, తారకరత్న వంటి వారు టిడిపికే మద్దతు పలుకుతారని చెబుతున్నారట. ఇలాంటి సమయంలో వారిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారట. చంద్రబాబు, బాలయ్యల మధ్య ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందంటున్నారు. రెండు రోజుల క్రితం తండ్రీ కొడుకుల చేసిన కామెంట్స్ పైన వారు చర్చించినట్లుగా సమాచారం.