సోనియాతో కిరణ్ భేటీ: క్యాబినెట్ విస్తరణపై ఏమైనట్లు..

కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో పాటు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. సమావేశం గంటకుపైగా సాగింది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై కిరణ్ కుమార్ రెడ్డి సోనియాతో మాట్లాడారని ప్రచారం సాగుతోంది.
సోనియాతో భేటీకి ముందు కిరణ్ కుమార్ రెడ్డి రెండుసార్లు గులాం నబీ ఆజాద్తో సమావేశమయ్యారు. సోనియాతో భేటీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. కానీ, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ఆయనకు అనుమతి లభించిందా, లేదా అనేది అనుమానంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సంబంధించి అధిష్టానం అనుమతి లభించగానే మీడియాకు చెబుతానని కిరణ్ కుమార్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో వారిద్దరు నిర్వహించిన రెండు శాఖలకు మంత్రులు లేకుండా పోయారు. సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన హోంశాఖ కోసం సీనియర్ మంత్రులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ తనకు కావాలంటూ పట్టుబడుతున్నారు. తనతో విభేదిస్తున్న దామోదర రాజనర్సింహకు ఆ శాఖను కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని అంటున్నారు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం భావించి, అందుకు అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. శాఖల మార్పునకు మాత్రం అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. అయితే, హోంశాఖ విషయంలో పీటముడి పట్టినట్లు తెలుస్తోంది. దామోదరకు కాకపోతే కె. జానారెడ్డికి హోంశాఖను ఇవ్వాలని కాంగ్రెసు పెద్దలు కొంత మంది సూచించినట్లు తెలుస్తోంది.
అయితే, దాని వల్ల సమస్యలు వస్తాయని, వేరేవారికి ఇవ్వడం వీలు కాకపోతే ఆ శాఖను తన వద్దనే ఉంచుకుంటానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. అయితే, శాఖల మార్పు కూడా ఇప్పట్లో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయాల్సి వస్తే అసెంబ్లీ సమావేశాల తర్వాతనే ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications