అద్వానీ డుమ్మా: బిజెపి నేతలు ఎవరేమన్నారు?
కొంత మంది బిజెపి సీనియర్ నాయకులు రాకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా - ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోయారని జవాబిచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదని కూడా ఆయన అన్నారు. లోకసభ ఎన్నికల ప్రచార సారథిగా నరేంద్ర మోడీని నియమించే ఆలోచనపై అద్వానీ అగ్రహంతో లేరని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. అద్వానీ గైర్హాజరుపై, ఇతర విషయాలపై బిజెపి నాయకులు ఎవరేమన్నారో చూద్దాం.
రాజ్నాథ్ సింగ్
అనారోగ్యం కారణంగా నేనే రావద్దని అద్వానీకి సూచించా.. రేపు ఆయన గోవాకు వస్తారు.
వెంకయ్య నాయుడు
అద్వానీ గైర్హాజరుపై ఎక్కువగా ఊహించుకోవద్దు. నేను ఆయనతో మాట్లాడా.. రేపు వస్తానని చెప్పారు.
జస్వంత్ సింగ్
సమావేశానికి నేను వెళ్లడం లేదు. ఆస్పత్రికి వెళ్తున్నా..
ఉమా భారతి
నరేంద్ర మోడీ గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. నేను ఏదైనా అంటే అది రాద్ధాంతమవుతుంది. ఈ విషయంపై నా అభిప్రాయం నాకు ఉంది. సరైన వేదిక మీద మాట్లాడుతా.. ఇది నాకు, పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మధ్యనే ఉంటుంది.
మనోహర్ పరికర్
బిజెపి విజయం సాధించాలంటే నరేంద్ర మోడీని అగ్రనేతగా ప్రకటించాలి.
యశ్వంత్ సిన్హా
నాయకత్వ సమస్యపై మాట్లాడడానికి బిజెపి జాతీయ కార్యవర్గం చాలా పెద్దది. ఈ విషయాన్ని పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని ఇది వరకే చెప్పాం.
స్మృతి ఇరానీ
అద్వానీ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నా. రేపు అద్వానీ వస్తారని వింటున్నా.. పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. పార్లమెంటరీ బోర్డు ఏం అనుకుంటుందో వేచి చూడాల్సిందే.
ప్రకాశ్ జవదేకర్
మాది ప్రజాస్వామ్య పార్టీ. ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. అయితే, అది ఎప్పుడు, ఎలా జరగాలి అనేది మాకు కావాలి. తగిన సమయంలో దానికి ఏర్పాట్లు చేస్తాం. పార్లమెంటరీ బోర్డు సరైన వేదిక.