విశాఖ: టిఎస్సార్ లీగల్ నోటీసు, అందలేదన్న దగ్గుబాటి
దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని 12 అంశాలతో కూడిన నోటీసును దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు పంపించారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని దగ్గుబాటి చెప్పారు. అందిన తర్వాత సమాధానం చెబుతానన్నారు.
కాగా, విశాఖ సీటుపై టిఎస్సార్, దగ్గుబాటిల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పలుమార్లు టిఎస్సార్ విశాఖ సీటు తనదేనని చెప్పిన నేపథ్యంలో పన్నెండు రోజుల క్రితం దగ్గుబాటి మీడియా ముందుకు వచ్చారు. తాము కాంగ్రెసు పార్టీలో చేరినప్పటి నుండి ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం టిక్కెటే తమకు కావాలని అడిగిన సందర్భాలు లేవన్నారు. తమకు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నర్సారావుపేట టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు అభ్యంతరం లేదన్నారు.
సుబ్బిరామి రెడ్డి నిత్యం తాను విశాఖ నుండి పోటీ చేస్తానని, 2009లో పురంధేశ్వరి నర్సారావుపేట టిక్కెట్ అడిగారు కాబట్టి అదే టిక్కెట్ ఇస్తారని చెప్పడాన్ని ఆయన ఖండించారు. తాము ఈ సీటు కావాలని ఎప్పుడు అడగలేదన్నారు. 2009లో టిఎస్సారే పురంధేశ్వరికి వైజాగ్ టిక్కెట్ ఇవ్వవద్దని లేఖ రాశారని ఆరోపించారు. 1981 - 82లో టిఎస్సార్ అరెస్టైయినప్పటి నుండి తమకు తెలుసునని చెప్పలేదు. టిఎస్సార్ తనకు నచ్చిన సీటును కోరుకోవచ్చునని అసత్యాలు చెప్పవద్దని హితవు పలికారు.
ఆయన వ్యాఖ్యలు ప్రజలను అపోహలకు గురి చేసే విధంగా ఉన్నందునే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఖాళీగా ఉన్న సినిమా తారలతో టిఎస్సార్ ఫంక్షన్లను ఏర్పాటు చేసుకొని తనను పొగిడించుకుంటారని ఎద్దేవా చేశారు. పనికిమాలిన బిరుదులు తీసుకుంటారన్నారు. టెండర్లు తక్కువ ధరకు కోట్ చేసి ఆ తర్వాత నష్టం వచ్చిందని అమౌంట్ పెంచుకోవడం ఆయన నైజమని, అలా వచ్చిన డబ్బులతో ఆయన హోటళ్లు నిర్మించారని ఆరోపించారు.
దీనిపై దగ్గుబాటి తీవ్రంగానే స్పందించారు. తాను కోర్టుకు వెళతానని హెచ్చరించారు. అయితే దగ్గుబాటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. తన ఆరోపణలపైన టిఎస్సార్ కోర్టుకు వెళితే తనకు అభ్యంతరమేమీ లేదని చెప్పారు. ఇప్పటి వరకు తాను కొన్ని విషయాలే చెప్పానని, ఆయన కోర్టు మెట్లు ఎక్కితే చిట్టా మొత్తం విప్పుతానని చెప్పారు. ఇప్పుడు ఆయన లీగల్ నోటీసులు పంపించారు. అయితే అవి అందలేదని దగ్గుబాటి చెబుతున్నారు.