అద్వానీ కోసమే నా బాధ: దిగ్విజయ్, భీష్ముడి ప్రస్తావన
తమకు నరేంద్రమోడీ అంటే భయం లేదని, పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మోడీని అభినందించారు గానీ, ఆయన ప్రధాని అభ్యర్థా కాదా అన్న విషయాన్ని బిజెపి తేల్చుకోవాలన్నారు. బిజెపిని రెండు స్థానాల స్థాయి నుంచి 12 స్థానాల స్థాయికి తెచ్చిన అద్వానీని మాత్రం వాళ్లు మర్చిపోవడం దారుణమన్నారు. మోడీది బిజెపి వ్యవహారమన్నారు.
తన హృదయం ఆయన కోసమే బాధపడుతోందని చెప్పారు. మోడీ ప్రభ అంతా గుజరాత్కే పరిమితమని, కర్ణాటక ఎన్నికల్లో ఆయన సత్తా ఏంటో చూశామని మోడీలాంటి మతవాద శక్తులను సామాన్యులు ఆదరించరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. అద్వానీ తాను చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నారని, 1956 ప్రాంతాల్లో మత రాజకీయాలను ఆయన ప్రారంభించగా ఇప్పుడు మోడీ ఆయనకంటే పెద్ద మతవాదినని చెప్పుకొంటున్నారని విమర్శించారు.
ఉత్తర ప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో బిజెపి అదృష్టాన్ని మార్చేందుకు మోడీ దగ్గర మేజిక్ ఏమీ లేదని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామాశ్రయ్ కుష్వాహా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి, మోడీకి పోలికే లేదని, రాహుల్ వివాదరహిత నాయకుడైతే మోడీ వివాదాల నాయకుడని ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అర్వీందర్ సింగ్ లవ్లీ అన్నారు. మోడీ అభివృద్ధి ఫలాలు గుజరాత్లో అన్ని వర్గాలకూ చేరలేదని ఆయన విమర్శించారు.
మోడీ బిజెపికే ప్రచార సారథి తప్ప ఎన్డీయేకు కాదని జెడి(యు) ప్రకటించింది. మోడీకి శివసేన, అకాళీదల్లు మద్దతు పలికాయి. మూడు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు మద్దతుగా నిలిచారు. మరోవైపు అద్వానీ అలకపై మోడీ మాట్లాడుతూ.. అద్వానీతో తాను ఫోన్లో మాట్లాడానని, ఆయన ఆశీర్వదించారన్నారు. అగ్రనేతల నమ్మకాన్ని నిలబెడతానన్నారు.
అద్వానీకి గుర్తుకొచ్చిన బీష్మ పితామహుడు
అనారోగ్యం వల్లే తాను గోవా సమావేశాలకు హాజరు కాలేదని అద్వానీ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. అందులో ఆయన ఎక్కడ కూడా మోడీ పేరును ప్రస్తావించలేదు. గడిచిన మూడు రోజులుగా తనకు కడుపు నొప్పి కలగడంతోనే దూరంగా ఉన్నానని వివరించారు. మరోవైపు అద్వానీ ఆదివారం తన బ్లాగులో మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో బాణాలతో గాయపడి, అంపశయ్యపై పడి ఉండే భీష్మ పితామహుడి ప్రస్తావన తీసుకు వచ్చారు. మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన రోజే ఆయన భీష్ముడి ప్రస్తావన తీసుకు రావడం గమనార్హం.