కూలిన భవనం: సంజయ్ లాయర్ కుమారుడి మృతి
ముంబై: రెండు రోజుల క్రితం కూలిపోయిన అత్లాఫ్ మాన్షన్ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 13 ఏళ్ల కుమారుడితో ప్రముఖ న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ పదే పదే సెల్ ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు. అయితే, అతన్ని కాపాడలేకపోయాడు. నాలుగు అంతస్థుల మహీం బిల్డింగులో నివసిస్తున్న మర్చంట్ ప్రమాదంలో తన భార్య అసిఫా (50), కుమారుడు ఫరాజ్, తల్లి తహీరాలను కోల్పోయారు.
ఫరాజ్ తన సెల్ ద్వారా తండ్రితో మాట్లాడుతూ తాను కింద చిక్కుకుపోయినట్లు చెబుతూ వచ్చాడు. ఏమీ కాదని, క్షేమంగా బయటకు వస్తావని మర్చంట్ అతనికి విశ్వాసం కల్పించే పనిచేస్తూ వచ్చాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. సోమవారం, మంగళవారం ఫరాజ్ మర్చంట్తో రెండు మూడు సార్లు మాట్లాడాడు.

కానీ మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఫరాజ్ ఫోన్ మూగబోయింది. చివరకు అతని ప్రాణాలతో కాకుండా నిర్జీవంగా బయటకు వచ్చాడు. ఇటీవలే టర్కీకి వెళ్లి మర్చంట్ కుటుంబ సబ్యులు తిరిగి వచ్చారు. వారితో పాటు టర్కీకి వెళ్లిన మర్చంట్ వారికన్నా ముందుగా తిరిగి వచ్చారు. భవనం కూలినప్పుడు మర్చంట్ తన పెద్దకుమారుడు ఫయాజ్, కూతురు ఫిజా తన కార్యాలయంలో ఉన్నారు.
భార్య అసిఫా, తల్లి తహిరా మృతదేహాలు బయటకు తీసినప్పుడు కూడా తన కుమారుడు ప్రాణాలతో బయట పడుతాడని మర్చంట్ ఆశించారు. అయితే, కుమారుడి శవాన్ని చూసి మర్చంట్ తట్టుకోలేకపోయాడు. అతను లేకుండా జీవించలేనని మర్చంట్ బోరుమన్నాడు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరఫున మర్చంట్ వకాల్తా తీసుకున్నాడు.
సంజయ్ దత్ భార్య మాన్యతా కుమారుడిని కోల్పోయిన మర్చంట్కు సానుభూతి తెలియజేశారు. మహిమ్లోని అత్లాఫ్ మాన్షన్ కూలిన ఘటనలో పది మంది మరణించారు, పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications