రగులుతున్న ఓయు: అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లే యత్నం
హైదరాబాద్: చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రగులుతోంది. భారీగా విద్యార్థులు ర్యాలీగా అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఓయు నుండి బయలుదేరిన ర్యాలీని పోలీసులు ఎన్సీసి ముఖద్వారం వద్దనే అడ్డుకున్నారు. విద్యార్థులు గేట్ల మీది నుండి దూకే ప్రయత్నాలు చేశారు. ముళ్ల కంచెలు, బ్యారీకేడ్లను ఛేదించుకొని విద్యార్థులు బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.
పోలీసులు కూడా భారీగానే మోహరించారు. ఎన్సీసి ముఖద్వారం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓయు నుండి బయటకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు వారి పైకి పలుమార్లు బాష్పవాయు ప్రయోగం చేశారు. అసెంబ్లీ వద్ద కూడా భారీ భద్రత ఉంది.

మరోవైపు ఎనిమిది మంది విద్యార్థులు పోలీసుల వలయాన్ని ఛేదించుకొని అసెంబ్లీ వైపుకు చొచ్చుకు పోయే ప్రయత్నాలు చేశారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోకి వెళ్లిన విద్యార్థులు అక్కడి నుండి అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాబు చలో అమెరికా అంటున్నారు: హరీష్
చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టులు, బైండోవర్ల పైన హరీష్ రావు హెచ్చార్సీని ఆశ్రయించారు. స్పందించిన హెచ్చార్సీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డిజిపిని ఆదేశించింది. హెచ్చార్సీ ఫిర్యాదు చేసిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... కిరణ్ ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఆత్మవంచన చేసుకోవద్దని సూచించారు. తెలంగాణవాదులను 48 గంటల పాటు ఎలా నిర్బంధిస్తారని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో కోవర్టు ఆపరేషన్ నడుస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం చలో అసెంబ్లీ అంటే చంద్రబాబు మాత్రం చలో అమెరికా అంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications