ఐపిఎల్ బెట్టింగ్: అప్పులు చెల్లించలేక విద్యార్థి ఆత్మహత్య
దేవరకొండ మండలం పడ్మట్పల్లి పంచాయతీ పరిధిలోని ఎల్లారెడ్డిబావికి చెందిన అలివేలు, వెంకటయ్య దంపతుల కుమారుడు భాగ్యరాజ్ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఇంద్రారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్ చేశాడు.
తన దగ్గరున్న డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు.. కొందరి వద్ద విపరీతంగా అప్పులు చేసి బెట్టింగ్స్కు పాల్పడ్డాడు. అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన భాగ్యరాజ్.. దేవరకొండలోని మిత్రుడి నివాసంలో టెలిఫోన్ వైరుతో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బెట్టింగ్స్ కారణంగా అతను రూ.2 లక్షల రూపాయల మేరకు అప్పు అయ్యాడు. వాటిని తీర్చలేకపోయాడు. అప్పు తీర్చేందుకు అతను తన ద్విచక్ర వాహనాన్ని అమ్మినా సరిపోలేదు. ఇతను ఇరవై రోజుల క్రితమే కళాశాల నుండి గ్రామానికి వెళ్లినా... ఇంట్లో ఉండలేదు. తండ్రి వెంకయ్య రైతు.
తన కొడుకుకు తాను ఇటీవల పంపిస్తున్న డబ్బులు ఉద్యోగం వెతుక్కోవడం కోసం ఉపయోగపడుతుందని తండ్రి భావించారట. ఈ డబ్బును కూడా బెట్టింగులో పెట్టాడు. ఇతను పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయాడని, వాటిని తిరిగి పొందేందుకు అప్పులు చేసి మరీ మళ్లీ బెట్టింగ్స్ కట్టినా వాటిని కోల్పోయాడని చెబుతున్నారు.