ఉంటే ఉండు, పోతే పో: కొణతాలకు జగన్ సంకేతాలు
దాడి వీరభద్రర రావు విషయంలో కొణతాల రామకృష్ణ జగన్ను చంచల్గుడా జైలులో గతంలో కలిశారు కూడా. ఆ తర్వాత కూడా కొణతాల రామకృష్ణ తన ధోరణి మార్చుకోలేదు. దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని చెబుతూ వస్తున్నారు. అయితే, ఆయనను బుజ్జగించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఏ మాత్రం ప్రయత్నాలు సాగించడం లేదు.
సర్దుకుని పార్టీలో ఉంటే ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలని జగన్ స్పష్టంగానే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కొణతాల రామకృష్ణ ఖండించారు కూడా. దాడి వీరభద్రరావును పార్టీ నుంచి దూరం చేసుకోవడానికి జగన్ సిద్ధంగా లేకపోవడంతో కొణతాల రామకృష్ణ పార్టీలో కొనసాగుతారా, లేదా అనేది చెప్పడం ప్రస్తుతం కష్టమే.
దాడి వీరభద్రరావుకు కూడా జగన్ ఏ విధమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పని చేసుకుంటూ వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. సర్వేలు చేయిస్తున్నామని, సర్వేల ఫలితాలను బట్టే టికెట్ల కేటాయింపు ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పారు. దీన్ని బట్టి టికెట్ల పంపకం సందర్భం వచ్చేసరికి ఎవరి జాతకం ఎలా ఉంటుందో కూడా చెప్పలేని స్థితి ఉందని అంటున్నారు.