ఎక్కడికీ పోను: గాలి, కేసును ముంచుతాడు: సిబిఐ
సాక్షుల వాంగ్మాలాలు తీసుకొన్నారని, అన్ని పత్రాలు సిబిఐ అధీనంలోనే ఉన్నాయని, వాటిని తారుమారు చేసే అవకాశం లేదని, కోర్టు విధించే ఏ షరతులకైనా కట్టుబడి ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. బెయిలు మంజూరు చేయాలని ఆయన తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ కోరింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలిదే కీలక పాత్ర అని, అంతిమంగా లాభపడ్డది కూడా ఆయనేనని వాదించింది. గాలికి బెయిలు మంజూరు చేస్తే సాక్షలను బెదిరించి కోర్టు ముందు హాజరుకాకుండా చేయగలరనీ, ఇప్పటికే గాలి అనుచరుల బెదిరింపుల వల్ల కొంతమంది సాక్షులకు రక్షణ కల్పిస్తున్నామని వెల్లడించింది.
గాలి బెయిల్పై విడుదలైతే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని కూడా సిబిఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఓఎంసీ కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. అక్రమ మైనింగ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెలికి తీయాల్సి ఉందని కోర్టుకు వెల్లడించింది.
జైలులో ఉండే గాలి బెయిలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని గుర్తు చేసింది. గాలిపై ఎటువంటి జాలి చూపాల్సిన పని లేదని అభిప్రాయపడింది. ఈ దశలో బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని వెల్లడించింది. సంజయ్ చంద్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఈ కేసుకు వర్తించవని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్ - గాలి, మరో నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డిల బెయిల్ పిటిషన్లపై తీర్పును వాయిదా వేశారు.
మోపిదేవి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణను సిబిఐ కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసులు తమకు వర్తించవని, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులో నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్పై వాదనలు కూడా ఈ నెల 25కు వాయిదా పడ్డాయి. 'చలో అసెంబ్లీ' కార్యక్రమ నేపథ్యంలో న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించడంతో కోర్టు ఈ కేసులను వాయిదా వేసింది.