జగన్, కెసిఆర్ టార్గెట్: మంత్రివర్గంలో పెద్ద వాటా
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకం కావడంతో అందుకు అనుగుణంగానే ప్రధాని డాక్టర్ మంత్రివర్గం కూర్పు జరిగినట్లు భావిస్తున్నారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎదుర్కునేందుకు బలమైన నాయకులు కావాలనే ఉద్దేశంతో, ఉన్న నాయకులకు బలం సంతరించి పెట్టే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోకి మరో ఇద్దరిని తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది.
ఇప్పటికే రాష్ట్రం నుంచి పది మంత్రి కేంద్ర మంత్రులు ఉన్నారు. సోమవారం మరో ఇద్దరు చేరడంతో ఆ సంఖ్య డజనుకు చేరుకుంది. 2009 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెసు తరఫున 33 మంది పార్లమెంటు సభ్యులు గెలిచారు. మొత్తం 42 స్థానాల్లో అంత పెద్దమొత్తంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సుసాధ్యమైంది. తొలుత రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు మంత్రివర్గంలో అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఒక్కసారిగా ఆ సంఖ్యను పదికి, ఆ తర్వాత 12కు పెంచారు.
కాంగ్రెసుకు చెందిన 33 మంది కాంగ్రెసు సభ్యుల్లో మందా జగన్నాథం, వివేక్ తెరాసలో చేరగా, సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెసుకు సన్నిహితంగా ఉంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మళ్లీ ఎన్నికయ్యారు. వైయస్ జగన్ కూడా అంతే. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ తమకు సవాల్ విసురుతుండడంతో సీమాంధ్రలో నాయకులను కాంగ్రెసు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

కిశోర్ చంద్రదేవ్కు ఇప్పటికే కేబినెట్ హోదా ఇవ్వగా, ఇప్పుడు కావూరి సాంబశివరావును కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. మంత్రులుగా అదనపు బలం సంతరించుకోవడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడం వారికి సులభమవుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, పల్లంరాజు వంటి కేంద్ర మంత్రులు మళ్లీ గెలవడమే కాకుండా, వారు మరింత మందిని గెలిపించగలరని కాంగ్రెసు అధిష్టానం భావిస్తూ ఉండవచ్చు. కాగా, రాజ్యసభకు ఎంపిక చేసి, మంత్రి పదవి ఇచ్చిన చిరంజీవి ద్వారా సీమాంధ్రలో ఆయనను ఎన్నికల కోసం వాడుకోవాలనే ఉద్దేశం మొదటి నుంచీ ఉంది. జెడి శీలం ద్వారా దళిత క్రైస్టవులను రాబట్టే ఉద్దేశం ఉంది.
సీమాంధ్రలో బలమైన కమ్మ, కాపు సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆ రెండు వర్గాలను తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లకుండా చూసుకునే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పనబాక లక్ష్మి, జెడి శీలం ద్వారా దళితులు వైయస్సార్ కాంగ్రెసు వైపు మల్లకుండా చూసుకునే యోచన ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ వంటి కేంద్ర మంత్రుల తమ సీట్లను గెలుచుకున్నా చాలుననే ఉద్దేశంతో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, ఎస్ జైపాల్ రెడ్డి అస్త్రసన్యాసం చేస్తానని చెబుతున్నారు. మొత్తం మీద, కేంద్ర మంత్రులుగా ఉన్న 12 మంది వచ్చే ఎన్నికల్లో 12 లోకసభ స్థానాలను తెచ్చిపెట్టడంతో పాటు బలమైన సిట్టింగులు కొన్ని స్థానాలను దక్కించుకున్నా గట్టెక్కగలమనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చినట్లు భావిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా లోకసభ స్థానాలను తెచ్చిపెట్టే బాధ్యతలు తీసుకుంటారని భావిస్తున్నారు. అలా అప్పగించాలని కూడా ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదంతా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహరచనగా చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమించాలనేది కూడా ఆయన నిర్ణయమే. మొత్తం మీద, రాష్ట్రాన్ని వదులుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదని ప్రస్తుత కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications