జగన్ ఎఫెక్ట్: మన్మోహన్ మంత్రివర్గంలో జెడి శీలం?

సహాయ మంత్రిగా జెడి శీలం సోమవారం జరిగే మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు బలమైన సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది మంత్రులు ఉన్నారు. దీంతో జెడి శీలం ఒక్కరికే రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
మంత్రి పదవిని ఆశిస్తున్న కావూరి సాంబశివరావును సిడబ్ల్యుసిలోకి శాశ్వత ఆహ్వానితుడిగా తీసుకున్నారు. అయితే, రాష్ట్రం నుంచి సాంబశివరావుతో పాటు తెలంగాణకు చెందిన వి. హనుమంతరావు, నంది ఎల్లయ్య కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వి. హనుమంతరావును ఎఐసిసి కార్యదర్శిగా నియమించారు. అందువల్ల కావూరికి గానీ విహెచ్కు గానీ మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు.
ఇదిలావుంటే, రాష్ట్రానికి చెందిన పల్లంరాజు శాఖ మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా బాపట్ల నియోజకవర్గానికి చెందిన దళిత పార్లమెంటు సభ్యురాలు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయనప్పటికీ అదే ప్రాంతానికి చెందిన జెడి శీలంకు మంత్రి పదవి కట్టబెట్టడానికి ప్రధానమైన కారణం దళిత క్రిస్టియన్లు జగన్ వైపు గుండగుత్తగా వెళ్లకుండా నిరోధించడానికేనని భావిస్తున్నారు. జెడి శీలం ఆర్థిక సహాయ మంత్రి పదవి లభించవచ్చునని అంటున్నారు.
సామాజిక వర్గాల సమీకరణలో కావూరి సాంబశివ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కష్టమని అంటున్నారు. ఇప్పటికే ఈ వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయనకు పార్టీలో ప్రత్యేక స్థానం కల్పించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications