భద్రతా సమస్య: చంచల్గూడ జైలు ఎదుట రోడ్డు బంద్

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్లతో పాటు పలువురు అధికారులు... ఇలా పలువురు ప్రముఖులు చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. గాలి, జగన్ వంటి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
చుట్టూ ఎటువంటి భద్రతా సౌకర్యాలు లేకపోవడంతో జైలు వద్దకు వస్తున్న వారిని అడ్డుకోవడానికి ఇబ్బంది ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం జగన్ను కోర్టు నుంచి జైలుకు తీసుకొస్తున్నప్పుడు ఒక వ్యక్తి జైలు గేటు వరకు వచ్చి ఆయనతో కరచాలనం చేయడం కలకలం సృష్టించింది. దీంతో జైలు ముందు ఎవరెవరు తిరుగుతున్నారు? ములాఖత్లు తీసుకుని ఎవరెవరు లోపలకు వెళ్తున్నారు? అన్న వివరాలు తెలుసుకునేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.
వీటితో పాటే జైలు ముందున్న రహదారిలో రాకపోకల పైనా నిఘా కొనసాగుతోంది. అయినప్పటికీ జైలు పరిసర ప్రాంతాల్లో ఇంకా భద్రతాలోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ రహదారిని పూర్తిగా మూసివేసి తమ అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రత్యామ్నాయంగా మహిళా జైలు వెనుక కొత్త రోడ్డు నిర్మించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పాత రహదారిని మూసివేసిన అధికారులు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications