బాబుకు జగన్ పార్టీ సవాల్, అప్పుడేం చేశారని టిడిపి
బాబుపై వైయస్సార్ కాంగ్రెసు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సచ్ఛీలుడు అయితే ఐఎంజి కేసులో విచారణకు సిద్ధం కావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఐఎంజిపై ఆ పార్టీ ఈ రోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. అన్ని వాయిదా తీర్మానాలతో సహా దీనిని కూడా సభాపతి తిరస్కరించారు. సభ వాయిదా పడిన అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... బాబు విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
కాంగ్రెసులో జగన్ పార్టీ విలీనం: టిడిపి
త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనమవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర విమర్శఇంచారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఐఎంజి భూ వ్యవహారాలపై ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారని ప్రశ్నించారు. జగన్, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని, వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిడిపి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు.
అసెంబ్లీలో విపక్షాలు వాయిదా తీర్మానాలపై పట్టుబట్టడంతో సభాపతి సభను మధ్యాహ్నం ఒకటి గంటలకు వాయిదా వేశారు.
టిడిపికి మండలిలో లేని నేత
శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష నేత సమస్యను ఎదుర్కొంటుంది. మొన్నటి వరకు మండలిలో దాడి వీరభద్ర రావు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ రాకపోవడం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం జరిగిపోయాయి. ఆయన స్థానంలో మండలికి యనమల రామకృష్ణుడు ఎన్నికయ్యారు. ఆయన ప్రతిపక్ష నేత కూడా. అయితే ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆ బాధ్యతలను శమంతకమణి, నన్నపనేని రాజకుమారి తదితరులు తీసుకుంటున్నారు.